యుపిఎ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా హమీద్ అన్సారీ
స్వతంత్ర భారతంలో ఉప రాష్ట్రపతిగా వరుసగా రెండో సారి అవకాశం దక్కించుకున్న రెండో వ్యక్తి అన్సారీ. 75 ఏళ్ల అన్సారీ అలిగడ్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్గా పనిచేశారు. ఇంత వరకు తత్వవేత్త, పరిపాలనాదక్షుడు సర్వేపల్లి రాధాకృష్ణ మాత్రమే రెండు సార్లు ఉప రాష్ట్రపతిగా పనిచేశారు.
2007లో యుపిఎ - 1 ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇచ్చిన వామపక్షాలు ఉప రాష్ట్రపతి పదవికి అన్సారీ పేరును సూచించాయి. దానికి కాంగ్రెసు నాయకత్వంలోని యుపిఎ ప్రభుత్వం అంగీకరించింది. బిజెపి అభ్యర్థి నజ్మా హెప్తుల్లాను ఆయన 455 ఓట్ల తేడాతో ఓడించారు. నిజానికి, అన్సారీని రాష్ట్రపతి పదవికి అన్సారీ పేరును ఖరారు చేస్తారని తొలుత ఊహాగానాలు చెలరేగాయి. అయితే, కాంగ్రెసు పార్టీ ఆర్థిక మంత్రిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ పేరును ముందుకు తెచ్చింది.
రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీని వ్యతిరేకించిన మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెసు పార్టీ ఉప రాష్ట్రపతి పదవికి అన్సారీ పేరును కూడా వ్యతిరేకించింది. కాగా, అన్సారీ అభ్యర్థిత్వంపై తృణమూల్ కాంగ్రెసు తన అభిప్రాయం తెలిపిందని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చెప్పారు. అన్సారీకి సోనియా అభినదనలు తెలిపారని ఆయన చెప్పారు.
అన్సారీకి మద్దతు తెలపాలని ప్రధాని మన్మోహన్ సింగ్ బిజెపి నేతలు ఎల్కె అద్వానీని, సుష్మా స్వరాజ్ను కోరినట్లు తెలుస్తోంది. అయితే, లోక్పాల్ బిల్లు వ్యవహారంపై ఆగ్రహంగా ఉన్న బిజెపి అన్సారీని బలపరచడానికి నిరాకరించినట్లు సమాచారం. ఎన్డియె భాగస్వామ్య పక్షం జెడియు అన్సారీ అభ్యర్థిత్వాన్ని బలపరిచే అవకాశం ఉంది. ఉప రాష్ట్రపతి పదవికి నామినేషన్లు దాఖలు చేయడానకి ఈనెల 20 ఆఖరు తేదీ.