వైజాగ్ సంచీల్లోని శరీరం ముక్కలు సైకో సాంబవేనా?
విశాఖపట్నం రైల్వే స్టేషన్లోని సంచీలో దొరికిన తలకు సంబంధించిన ఫొటోను విజయవాడ పోలీసులు తెప్పించుకున్నారు. శరీరభాగాలను ఫోరెన్సిక్ నిపుణులకు పంపించారు. తలను పోలీసులు మీడియాకు విడుదల చేశారు. విశాఖపట్నం రైల్వేస్టేషన్లో సోమవారం ప్లాస్టిక్ సంచీలో మృతదేహం ముక్కలుగా నరికిన భాగాలు కనిపించాయి. రైల్వే స్టేషన్లోని ఆరవ నెంబర్ ప్లాట్ ఫారం వద్ద మూడు బ్యాగులలో శరీర అవయవాలు ముక్కలు ముక్కలుగా చేసి కుక్కి ఉన్నాయి.
అయితే, కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి అడవిలో పోలీసుల నుంచి తప్పించుకున్న ఉన్మాది రాచమళ్ల సాంబశివరావు అలియాస్ సైకో సాంబను పట్టుకునేందుకు పోలీసులు వ్యూహాన్ని మార్చినట్లు వార్తలు వచ్చాయి. నాలుగు రోజులుగా వందలాది మంది పోలీసులు అడవిలో కూంబింగ్ నిర్వహించినా అతన్ని పట్టుకోలేకపోయారు. దీంతో ఇక పోలీసులతో పనికాదని భావించిన ఉన్నతాధికారులు సోంబ కోసం వేటగాళ్లను రంగంలోకి దింపారు.
పోలీసుల సంఖ్య ఎక్కువగా ఉండటం, అడవిలో హడావుడి నెలకొనటంతో నిందితుడు పొదలలో నక్కి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసు బలగాలకు బదులు వేటగాళ్లను వినియోగించుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు భావించారు. అందులో భాగంగానే గుంటూరు బలగాలతో చేపట్టిన కూంబింగ్ను సోమవారం నిలిపివేశారు. ఆ జిల్లాకు చెందిన 15 మంది స్పెషల్ పార్టీ పోలీసులే కొండపల్లిలో ఉన్నారు.
విజయవాడకు చెందిన 50 మంది పోలీసులతో కొండపల్లి అడవి దిగువన ఉన్న గ్రామాలలో గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం పోలీసులు అడవిలోకే వెళ్లలేదు. మూలపాడు, కీలేశపురం, గంగినేని, జి.కొండూరు, కొండపల్లి తదితర గ్రామాలలో గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే పలు గ్రామాల్లో వాల్పోస్టర్లు వేసి పట్టిస్తే లక్ష రూపాయల నగదు బహుమతిని ప్రకటించారు. పోలీసులు, స్థానికులు కలిసి సైకో సాంబ కోసం గాలించారు.