బీజాపూర్ ఎన్కౌంటర్పై విచారణకు ఎన్నారైల డిమాండ్
"ఛత్తీస్-గఢ్ రాష్ట్రంలోని బిజాపూర్ జిల్లాలో బాసగూడ, సార్కగూడ వద్ద పదిహేడు మంది ఆదివాసులను పోలీసు, సి.ఆర్.పి.ఎఫ్ సాయుధబలగాలు కాల్చిచంపాయి. గత కొన్ని సంవత్సరాలుగా, ఆపరేషన్ గ్రీన్-హంట్ పేరుతో వేలాది సాయుధబలగాలు దండకారణ్యంలో కోంబింగ్ ఆపరేషన్లు, దాడులు చేస్తున్నాయి. ఆదివాసీలకు మంచినీరు, విద్య, వైద్యం లాంటి మౌళిక వసతులు, ఉపాధి అవకాశాలు కల్పించటంలో ప్రభుత్వాలు విఫలమైనాయి. ఆదివాసీలను అడవినుండి వెళ్ళగొట్టి మైనింగ్ పేరుతో అటవీప్రాంతాలను బడా పారిశ్రామిక వేత్తలకు అప్పగిస్తున్నాయి. ప్రజల చేత ఎన్నుకోబడామని చెప్పుకునే ప్రభుత్వాలు ఎన్ కౌంటర్ల పేరుతో ఆదివాసీలు చంపివేయటం ఎంతవరకు సమంజసం? జీవించే హక్కును నిరాకరించటం న్యాయమా?
బి.బి.సి కరస్పాండెంటు సాల్మన్ రవి ప్రెస్-రిపోర్టు ప్రకారం, స్థానిక గ్రామస్థులు ఎన్-కౌంటరులో చనిపోయిన వారు అమాయక ఆదివాసీలని పేర్కొన్నారు. ది హిందూ దిన పత్రిక కరస్పాడెంటు అమన్ సేథీ రాసిన ప్రెస్-రిపోర్టు ప్రకారం పోలీసులు, సి.ఆర్.పి.ఎఫ్ సాయుధ బలగాలు ఐదుగురు పిల్లలను కాల్చిచంపారు. నాలుగు ఆదివాసీ ఆడపిల్లలపైన సెక్స్ దాడులు చేసారు. కాకా సరస్వతి అనే 12 సంవత్సరాల ఆడపిల్లను బుల్లెట్లతో కాల్చిచంపారు. సాబ్కామిట్టు 17 సంవత్సరాల బాలుడుని గొంతు కోసి చంపారు. ఎవరైనా నేరం చేస్తే, వారిని అరెస్టు చేసి రాజ్యాంగం లోని ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం విచారించి, న్యాయస్థానాల ద్వారా శిక్షించాలి తప్ప, చట్టవ్యతిరేకంగా ఎన్ కౌంటర్ల పేరుతో కాల్చిచంపడం న్యాయమా? మానవహక్కులు కాలరాయడంలో కాంగ్రెస్ పార్టీకు భారతీయ జనతా పార్టీ పోటీ పడుతున్నదా?
పౌరులను రక్షించాల్సిన రాజ్యం, సమాజంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన ప్రభుత్వం, శాంతియుతమైన పౌరపాలన అందించాల్సిన రాజకీయ పాలకులు, ప్రజాస్వామ్యాన్ని కాలరాసి ఎన్ కౌంటర్ హత్యలకు పాల్పడటం చాలా విచారకరమైన విషయం. మానవహక్కులను ఉల్లంఘించటం దురదృషకరమైన విషయం. గతంలో ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం ‘సాల్వ జుడుం' పేరుతో చట్టవ్యతిరేక సాయుధ మూఠాలను నడిపింది. దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ‘సాల్వ జుడుం' భారత రాజ్యాంగ విరుద్దమని తీర్పును ఇచ్చింది. అక్కడి బిజేపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుతీర్పును సహితం లెక్కచేయకుండా ‘సాల్వజుడుం' పేరును ‘ఛత్తీస్-గఢ్ రిజర్వు పోలీసు ఫోర్స్' గా మార్చి నడుపుతున్నది. కేంద్ర హోమ్ మంత్రి చిదంబరం- చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి రమణసింగ్ పోలీసు, సి.ఆర్.పి.ఎఫ్ సాయుధబలగాలతో దాడులు చేయిస్తున్నారు. జనాన్ని చంపితే హక్కుల పోరాటాలు ఆగుతాయా? కాంగ్రెసు, బిజెపి ప్రభుత్వాల పాలక-విధానంలో భాగంగా ఎన్-కౌంటర్లు జరుగుతున్నాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది ముఖ్యమంత్రులు ‘ఎన్ కౌంటర్లు వద్ద'ని ప్రభుత్వ విధానంగా ప్రకటించిన కాలంలో ఎన్ కౌంటర్లు జరగలేదు.
సభ్యసమాజంలోని పౌరులు, ప్రజాస్వామికవాదులు, ప్రవాస భారతీయులు, దళితులు,మానవహక్కుల కార్యకర్తలు, విద్యార్ధులుగా యీ చట్టవ్యతిరేక హత్యలు, ఎన్ కౌంటర్లను మేము ఖండిస్తున్నాం, యీ సంఘటనపైన సుప్రీం కోర్టు స్వయంగా విచారణ చేపట్టవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్రంలోని కాంగ్రెసు ప్రభుత్వం, ఛత్తీస్ గఢ్ లోని బిజేపీ ప్రభుత్వం తక్షణమే ఎన్-కౌంటర్ల చావులను ఆపివేయాలని, ఛత్తీస్ గఢ్ నుండి సాయుధబలగాలను విరమించాలని, ఆపరేషన్ గ్రీన్ హంట్ ఆపాలని మనవి చేస్తున్నాం".