గౌహతి కీచకం: నిన్న అల్కా... నేడు టివి ఎడిటర్ రిజైన్
వివిధ దర్యాఫ్తు బృందాలు జర్నలిస్టు పాత్రపై కూడా దర్యాఫ్తు సాగిస్తున్న నేపథ్యంలో వెలుగులోకి వస్తున్న ఆధారాలు ఈ ఆరోపణలను బలపరుస్తున్నాయి. అమ్మాయిపై జరిగిన దారుణాన్ని కెమెరాతో చిత్రీకరించి, ఆ వీడియో క్లిప్పింగ్లను ఆన్లైన్ ద్వారా బయటపెట్టిన న్యూస్ లైవ్ జర్నలిస్టు గౌరవ్ జ్యోతి నియోగ్ను మంగళవారం పోలీసులు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు.
ఈ ఘటనపై దర్యాఫ్తు నిష్పాక్షికంగా సాగేందుకు న్యూస్లైవ్ ఛానల్ ప్రధాన సంపాదకుడు అత్ను బుయాన్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇప్పటికే బాధితురాలి వివరాలు బయటపెట్టినందుకు ఎన్సిడబ్ల్యు సభ్యురాలు అల్కా లాంబాను ఆ పదవి నుండి తొలగించారు. ఇప్పుడు బుయాన్ ఆయనకు ఆయనే రాజీనామా చేశారు. జరిగిన సంఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ తాను రాజీనామా చేయడం లేదని, దర్యాఫ్తు నిష్పక్షపాతంగా జరిగేందుకే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు అమ్మాయిపై అత్యాచారయ్నం పెద్ద కుట్రలో భాగంగానే జరిగిందని సమాచార హక్కు చట్టం కార్యకర్త, అన్నాహజారే బృందంలోని సభ్యుడు అఖిల్ గోగోయ్ ఆరోపిస్తున్నారు.
ఆ ఛానల్ రాష్ట్రానికి చెందిన ఓ మంత్రిది అని, ఆ మంత్రి భార్య ఛానల్ సిఈవోగా ఉన్నారని అతను ఆరోపిస్తున్నారు. మొత్తం సంఘటన అంతా కుట్రపూరితంగా జరిగిందని చెబుతున్నారు. బాధితురాలితోను, ఆమె స్నేహితులతోను న్యూస్ లైవ్ జర్నలిస్టు గొడవపడ్డాడని, ఆ తర్వాత అతడు బాధితురాలిపై దాష్టీకానికి ప్రధాన నిందితుడైన అమరజ్యోతి కలితాను ఉసిగొల్పాడని, ఘటనా స్థలంలోని జనం కూడా తోడవటంతో పరిస్థితి అదుపు తప్పిందని చెప్పారు.
మరోవైపు అత్యాచారం, అత్యాచారయత్నం తదితర ఘటనలలో బాధితురాలి పేరు, ఆమె వివరాలు వెల్లడించరాదని చట్టం చెబుతోంది. అసోం ప్రభుత్వం మాత్రం ఈ చట్టాన్ని ఉల్లంఘించింది. సమాచార, ప్రసార శాఖ బాధితురాలి పేరు, వివరాలు, ఫోటోను విడుదల చేసింది. దీనిపై పలువురు మండిపడ్డారు. అంతకుముందే ఎన్సిడబ్ల్యు నియమించిన కమిటీ సభ్యురాలు అల్కా లాంబా బాధితురాలి పేరు, వివరాలను బయటపెట్టారు.
దీంతో అల్కా లాంబాను తొలగించారు. అమ్మాయికి, కుటుంబానికి ఎన్సిడబ్ల్యు అధ్యక్షురాలు మమతా శర్మ క్షమాపణలు చెప్పారు. అల్కా లాంబా కూడా దీనిపై విచారం వ్యక్తం చేశారు. గుహవటి దుశ్శాసన పర్వంపై చానల్, జర్నలిస్టులపైనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో బ్రాడ్కాస్ట్ ఎడిటర్స్ అసోసియేషన్ (బిఈఎ) స్పందించింది. ముగ్గురు సభ్యుల సీనియర్ ఎడిటర్ల బృందం గువాహటి వెళ్లనుందని, మీడియా పాత్రను ఈ కమిటీ పరిశీలించనుందని బీఈఏ తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ బృందానికి బీఈఏ ప్రధాన కార్యదర్శి ఎన్కే సింగ్ నేతృత్వం వహిస్తారని, కమిటీలో సీనియర్ జర్నలిస్టులు దిబాంగ్, అశుతోష్ ఉంటారని వివరించింది.