ప్రియురాలితో కలిసి భార్య హత్య, 3 గంటలు కార్లో రౌండ్
సదరు వ్యాపారవేత్త తన భార్య మృతదేహంపై తన ప్రియురాలి సహాయంతో పెట్రోల్ పోసి కాల్చి వేసి ఆ తర్వాత దానిని జాతీయ రహదారి పక్కన ఉన్న మురుగు కాలువలో పడేశాడు. ఈ కేసులో పోలీసులు నిందితుడైన వ్యాపారవేత్త వజీందర్ సింగ్, అతని ప్రియురాలు రేణును అరెస్టు చేశారు. పోలీసులు వ్యాపారవేత్త భార్య పూజ మృతదేహాన్ని హోషీపూర్ జిల్లాలోని ఓ అటవీ ప్రాంతంలో స్వాధీనం చేసుకున్నారు.
వజీందర్ సింగ్ సెక్టార్ 35లో ఉన్న నైక్ అండ్ బేకర్స్ ఫ్రాంచైసీకి మేనేజర్. ఇతనికి ఆరేళ్ల క్రితం పూజాతో పెళ్లయింది. మూడేళ్లుగా ఇతను రేణు అనే యువతితో అక్రమ సంబంధం నెరపుతున్నాడు. వజీందర్ తన భార్యను దూరం చేసుకోవాలనుకున్నాడు. ఇందులో భాగంగా అతను ఈ నెల 13న ఆమెను హత్య చేశాడు. పూజ కనిపించక పోవడంతో ఆమె బంధువు బల్వీందర్ పాల్ చండీగఢ్లోని సెక్టర్ 19 పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. అయితే పూజ సోదరుడు ప్రేం చంద్ వజీందర్పై అనుమానాలు వ్యక్తం చేశాడు. రేణు అనే మరో యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్న వజీందరే తన సోదరి పూజను హత్య చేసి ఉంటాడని పోలీసుల వద్ద అనుమానం వ్యక్తం చేశాడు.
వజీందర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిని ప్రశ్నించారు. అతను తన నేరాన్ని ఒప్పుకున్నాడు. తాను తన ప్రియురాలు రేణుతో కలిసి తన భార్యను హత్య చేశానని చెప్పాడు. తామిద్దరం సెక్టర్ 9 వద్ద ఆమెను ఉరేశామని, ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని కారులోని ముందు సీటులో పెట్టి, సీటు బెల్ట్ ధరింప చేశామని, వంద కిలోమీటర్లు ప్రయాణించి ఆ మృతదేహాన్ని హోషీపూర్ జిల్లా పరిధిలో పడవేశామని చెప్పాడు.
తొలుత రేణును పెళ్లి చేసుకోవడానికి తాను పూజ నుండి విడాకులు కోరానని వజీందర్ సింగ్ పోలీసులకు తెలిపాడు. అయితే ఆ మాట మార్చాడు. తమిద్దరి మధ్య విభేదాలు పొడసూపాయన్నాడు. పోలీసులు రేణును కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
వజీందర్ జూలై 13న కారులో వెళుతుండగా పూజకు మత్తు మందు కలిపిన సాఫ్ట్ డ్రింక్ ఇచ్చి ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత రేణును పిలిపించి ఇద్దరు కలిసి పూజ గొంతు నులిమి ఉంటారని, అదే కారులో ముగ్గురు కలిసి హోషీపూర్ వెళ్లారని, అక్కడకు వెళ్లే వరకు పూజ చనిపోలేదని, దీంతో మరో రెండుసార్లు పూజ గొంతు నులిమారని, ఆ తర్వాత ఆమె బాడీకి నిప్పంటించారని పోలీసులు చెబుతున్నారు.