జగన్ పార్టీని అగడలేదు, ఎందుకేశారో: శ్రీధర్ బాబు
ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇవ్వాలని తాము మిత్రపక్షం మజ్లీస్ను, వామపక్షాలను మాత్రమే కోరామని ఆయన చెప్పారు. తాము కోరకపోయినా, కారణమేదైనా ప్రణబ్ ముఖర్జీకి ఓటేసినందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీని అభినందిస్తున్నామని ఆయన చెప్పారు. ఓటు ఫర్ బెయిల్ అనేది మీడియా సృష్టేనని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కాంగ్రెసుతో కుమ్మక్కయిందనే ప్రచారంలో నిజం లేదని ఆయన అన్నారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), సిపిఐ ఓటు వేయకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఆ మూడు పార్టీలు ఓటు వేయకపోవడం సరి కాదని, ఓటు వేయకపోవడానికి ఆ మూడు పార్టీలు సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. ఓటు హక్కును వినియోగించుకోని పార్టీలు ప్రజల వద్దకు వెళ్లి ఓటేయాలని ఎలా అడుగుతాయని ఆయన ప్రశ్నించారు
తెలంగాణపై 2012లోనే కేంద్రం ప్రభుత్వం నుంచి నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణపై త్వరలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రణబ్ ముఖర్జీకి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఓటు వేయడాన్ని అన్ని పార్టీలూ స్వాగతిస్తున్నాయని వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి విశాఖపట్నంలో అన్నారు. ఓటు వేయకుండా తెలుగుదేశం పార్టీ అపకీర్తిని మూట కట్టుకుందని ఆయన వ్యాఖ్యానించారు.