ప్రణబ్కి ఓటు, విమర్శలు: జగన్ పార్టీ దిద్దుబాటు
తెలంగాణ సెంటిమెంట్ గౌరవిస్తున్నానని చెప్పిన జగన్ తెలంగాణ వ్యతిరేకి అయిన ప్రణబ్కు ఓటు వేయడమేమిటని టిఆర్ఎస్, తమపై లాలూచీ ఆరోపణలు చేసిన జగన్ పార్టీయే కాంగ్రెసుతో కుమ్మక్కైందని టిడిపి నేతలు విమర్శలు గుప్పించారు. దీంతో అసెంబ్లీలో ఓటు వేసిన అనంతరం జగన్ పార్టీ నేతలు వీటిపై వివరణ ఇచ్చుకున్నారు. అదే సమయంలో నెల్లూరు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి వ్యాఖ్యల పైనా వివరణ ఇచ్చారు.
తాము మొదటి నుండి కాంగ్రెసు, టిడిపికి వ్యతిరేకమని ఆ పార్టీ ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, ధర్మాన కృష్ణదాసు తదితరులు చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికలు రాజకీయాలకు అతీతం కాబట్టి తాము కాంగ్రెసు పార్టీతో లాలూచీకి పాల్పడ్డామనే వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు. టిడిపియే కుమ్మక్కైందన్నారు. ప్రజాస్వామ్యంలో ఉండి ఎన్నికలకు దూరంగా ఉండటం సరికాదన్నారు. బిజెపి మద్దతివ్వడం వల్లే తాము సంగ్మాకు మద్దతివ్వలేదని, అదే సమయంలో ప్రణబ్ సరైన అభ్యర్థి అని అందుకే ఓటేశామన్నారు.
తాము ప్రభుత్వంతో కుమ్మక్కయ్యామన్న టిడిపి, టిఆర్ఎస్లు దమ్ముంటే అవిశ్వాసం పెట్టాలని అప్పుడు తాము ప్రభుత్వాన్ని కూల్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కాంగ్రెసుతో తాము కుమ్మక్కై ఉంటే జగన్ జైలుకు వెళ్లి ఉండే వారు కాదని, ఇప్పుడు కూడా ఆయన జైలులోనే ఉన్నారని ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభా నాగి రెడ్డి అన్నారు. సిబిఐ దర్యాఫ్తు వెనుక కాంగ్రెసు హస్తం లేకపోవచ్చునని మేకపాటి అనలేదని వివరణ ఇచ్చారు. తాము తొలి నుండి కాంగ్రెసు హస్తం ఉందని చెబుతున్నామని గుర్తు చేసారు.