నామా-తుమ్మల: నందమూరి ఫ్యామిలీ పంతాలు వీడేనా
తొలి నుండి జిల్లాలో ఆధిపత్య పోరు కోసం ఇద్దరూ తహతహలాడుతున్నారు. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటించినప్పుడు కూడా తుమ్మల, నామాలు ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు. అయితే ఈ మధ్యనే వీరిద్దరు కలిసి పోయారు. ఎందుకంటే పార్టీ కోసం. ప్రస్తుతం పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దృష్ట్యా ఇంటి పోరు ఉంటే మరింత కష్టమని వారు భావించారట. అందుకే పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టకుండా ఉండేందుకు వారిద్దరూ రాజీకొచ్చారట. ఇటీవల ఇద్దరు కలిసి ఎడ్లబండి ఎక్కి ర్యాలీలో పాల్గొని కార్యకర్తలలో ఉత్సాహం నింపారు.
నామా, తుమ్మల కలిసి ఒక్కటిగా ఉండటం చూసిన జిల్లా కార్యకర్తలలో కొత్త జోష్ కనిపిస్తోందట. జిల్లా పార్టీకి ఇక తిరుగు లేదని గట్టిగా చెబుతున్నారట. అదే సమయంలో నామా మాట్లాడుతూ... తాను ఎంపిగా అయిన తర్వాత ఇద్దరు కలసి మనస్ఫూర్తిగా మీ ముందుకు వచ్చామని కార్యకర్తలకు చెప్పారట. ఈ అంశంపై టిడిపి శ్రేణుల్లో చర్చ జరుగుతోందని తెలుస్తోంది. పార్టీ కోసం ఎవరి ప్రమేయం లేకుండానే నామా, తుమ్మలలు ఒక్కటయ్యారని వీరి దారిలోనే పార్టీకి కీలకమైన నారా, నందమూరి కుటుంబాలు నడిస్తే బాగుంటాయని భావిస్తున్నారట.
అదే సమయంలో మిగతా జిల్లాల్లోనూ విభేదాలు ఉన్న నేతల మధ్య ఇలాంటి చొరవ రావాలని, అలా వస్తే 2014లో పార్టీకి తిరుగు లేదని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారట. తమ మధ్య విభేదాలు లేవని నందమూరి, నారా కుటుంబాలు ఎంతగా చెబుతున్నప్పటికీ వారి మాటల్లోని గూడార్థాలు విభేదాలను స్పష్టం చేస్తున్నాయని అంటున్నారు. ఎలాంటి బంధుత్వం లేకుండానే నామా, తుమ్మలలు పార్టీ కోసం ఒక్కటయ్యారని, అలాంటిది బంధుత్వం ఉన్న నందమూరి, నారా కుటుంబాలు కూడా పంతాలు వీడితే పార్టీకి ఎంతో ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.