రాష్ట్రపతి ఎన్నిక: ప్రణబ్ ముఖర్జీ విజయం ఖాయం
రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించడానికి 5లక్షల 49 వేల 442 ఓట్లు రావాల్సి ఉంటుంది. అది కూడా ఓటర్లంతా పోలింగులో పాల్గొంటే. ప్రణబ్ ముఖర్జీకి 7.5 లక్షల విలువ చేసే ఓట్లు వస్తాయని యుపిఎ నేతలు ధీమాతో ఉన్నారు. ఓట్ల లెక్కింపు ఆదివారం జరుగుతుంది. సాయంత్రంలోగా ఫలితాలు వెలువడతానయి భావిస్తున్నారు.
యుపిఎ కీలక భాగస్వామి తృణమూల్ కాంగ్రెసు చివరి నిమిషంలో ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేయాలని నిర్ణయం తీసుకుంది. యుపిఎ భాగస్వామ్య పక్షాలతో పాటు ఎస్పీ, బిఎస్పీ, ఆర్జెడి, జెడి (ఎస్), ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన శివసేన, జెడి (యు), సిపిఎం, ఫార్వర్డ్ బ్లాక్ ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇస్తున్నాయి.
తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐ, ఆర్ఎస్పీ రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉంటున్నాయి. వాటి ఓట్ల విలువ దాదాపు 36 వేలు ఉంటుంది. ఇతర చిన్నపార్టీల ఓట్ల విలువ కూడా దాదాపు 32 వేలు ఉంటుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎన్సీపి నుంచి తప్పుకున్న సంగ్మాకు బిజెపి, అకాలీదళ్, అన్నాడియంకె మద్దతు ఉంది.
ఇదిలా వుంటే, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో యుపిఎ అభ్యర్థి హమీద్ అన్సారీకి మద్దతు ఇవ్వాలని సిపిఐ నిర్ణయించింది. రాష్ట్రపతి ఎన్నికల్లో సిపిఐ ఓటింగుకు దూరంగా ఉంటుంది.