చెరువులో శవమై తేలిన ఐదో తరగతి విద్యార్థి
తన కుమారుడు కనిపించకపోవడంతో విశాల్ తల్లిదండ్రులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెరువులో ఎవరో మునుగుతున్నట్లున్నారని స్థానికులు చెప్పడంతో పోలీసులు గురువారం చెరువులో గాలించారు. కానీ ఫలితం కనిపించలేదు. అయితే, శుక్రవారం ఉదయం విశాల్ శవం చెరువులో తేలడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. శవంతో తమ వద్ద ఉన్న ఫొటోను సరిపోల్చి విశాల్ తల్లిదండ్రులను పిలిపించారు.
విశాల్ ఎస్ఆర్డిజి స్కూల్లో ఐదో తరగతి చదువుతున్నాడు. ఏదో భయం కారణంగానే విశాల్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. బహుశా, చదువుపై భయంతో అతను ఈ దారుణాన్ని ఒడిగట్టి ఉంటాడని భావిస్తున్నారు. ఈ విషయంపై పోలీసులు తల్లిదండ్రులను ప్రశ్నిస్తున్నారు. విశాల్ చదువుపై వారు పాఠశాల టీచర్లను కూడా అడిగి తెలుసుకుంటున్నారు.
విశాల్ మృతి మిస్టరీగానే కనిపిస్తున్నప్పటికీ భయం కారణంగానే అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. స్థానికులు గురువారం అందించిన సమాచారాన్ని బట్టి కూడా వారు అదే నిర్ధారణకు వస్తున్నారు.