శరద్ పవార్, ప్రఫుల్ రాజీనామా: సవాలక్ష కారణాలు
ఆ తర్వాత పవార్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్తోనూ భేటీ కానున్నారు. రాజీనామాల నేపథ్యంలో సాయంత్రం కోర్ కమిటీ భేటీ కానుంది. ఎన్సీపి కూడా అత్యవసరంగా సమావేశం కానుంది. గురువారం సాయంత్రం జరిగిన కేబినెట్ సమావేశానికి వీరిద్దరు హాజరు కాలేదు. అంతేకాకుండా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలా నడపాతో కాంగ్రెసుకు తెలియదని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కాగా పవార్, ప్రఫుల్ల రాజీనామాలకు కేవలం నెంబర్-2 పదవి ఒకటే కారణం కాదని తెలుస్తోంది. అందుకు పలు కారణాలు ఉన్నాయని అంటున్నారు.
ప్రఫుల్ పటేల్కు ఇచ్చిన పదవిపై ఎన్సీపి అసంతృప్తితో ఉన్నదని చెబుతున్నారు. ఆయన శాఖను మార్పించే ప్రయత్నం పవార్ చేస్తున్నారని అంటున్నారు. మరింత ప్రాధాన్యత కల్గిన శాఖను ప్రఫుల్కు ఇవ్వాలని పవార్ కాంగ్రెసును డిమాండ్ చేస్తున్నారట. భద్రతకు సంబంధించిన ఉన్నతస్థాయి మంత్రివర్గ సంఘంలో తనను చేర్చక పోవడంపై కూడా పవార్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారట.
తన వ్యవసాయ శాఖకు సంబంధించిన పలు సమస్యలపై కాంగ్రెసు నేతలు తననే తప్పు పట్టడాన్ని పవార్ జీర్ణించుకోలేక పోతున్నారట. ధరల పెరుగుదల తదితర సమస్యలపై తనను విపక్షాలు తప్పు పట్టడాన్ని పక్కన పెడితే కాంగ్రెసు నేతలే తన వైపు వేలు చూపించడాన్ని పవార్ సోనియా దృష్టికి తీసుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులను పవార్ సరిగా అంచనా వేయలేకపోతున్నారని, బ్లాక్ మార్కెట్ను నిరోధించలేక పోతున్నారంటూ కాంగ్రెసు నేతలు తనపై చేసే విమర్శలకు కౌంటర్గానే ఆయన రాజీనామాస్త్రం ప్రయోగించారని అంటున్నారు.
నెంబర్ టూ పదవి, ప్రఫుల్ పటేల్ శాఖ మార్పిడి, తన శాఖపై సొంత కూటమి నేతల విమర్శలు తదితరాలతో పాటు సొంత పార్టీ నేతల నుండి వస్తున్న ఒత్తిళ్లు కూడా కారణమని చెబుతున్నారు. కూటమిలోని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బెట్టు చేసి తన డిమాండ్లను నెరవేర్చుకుంటున్న దారిలోనే ఎన్సీపి వెళ్లాలని పార్టీ నేతలు పట్టుబడుతున్నారట. ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో కాంగ్రెసుతో జట్టు కట్టిన తమకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా కాంగ్రెస్ మెడలు వంచాలని ఎన్సీపి నాయకుల నుండి ఒత్తిళ్లు వస్తున్నాయని అంటున్నారు.