డిఎండికె అధినేత, హీరో విజయకాంత్కు చుక్కెదురు
ఆయన మధ్యంతర పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. విజయకాంత్ 2011 సాధారణ ఎన్నికలలో రిషివంత్యం నియోజకవర్గం నుండి పోటీ చేసి శాసనసభ్యుడిగా గెలుపొందారు. జయంతి అనే మహిళ కూడా అదే నియోజకవర్గం నుండి బరిలోకి విజయకాంత్ పైన పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆమె నామినేషన్ను ఈసి తిరస్కరించింది.
దీంతో ఆమె కోర్టు మెట్లెక్కారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జయంతి ఎమ్మెల్యే విజయకాంత్ గెలుపును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఆమె పిటిషన్ స్వీకరించిన న్యాయమూర్తి కె వెంకటరామన్ డిఎండికే అధినేత విజయకాంత్ సహా పదమూడు మందికి నోటీసులు జారీ చేశారు. తనపై కొందరు దాడి చేయడం వల్ల తన నామినేషన్ పత్రాలు చినిగిపోయాయని, 2011 మార్చి 25న తన భర్త పైన కూడా ఓ గ్యాంగ్ అటాక్ చేసిందని, తాను సెకండ్ సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశానని, వాటిని స్కూటినిటీలో తిరస్కరించారని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు.
తాను దాఖలు చేసిన సెకండ్ సెట్ నామినేషన్ను తిరస్కరించడం సరికాదని, ఈ విషయంపై విచారణ జరిపి, విజయకాంత్ ఎన్నికను రద్దు చేయాలని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈమె పిటిషన్ను కొట్టి వేయాలని విజయకాంత్ కోర్టుకెక్కారు. అయితే హైకోర్టు విజయకాంత్ పిటిషన్ను తిరస్కరించింది.
కాగా మాజీ మంత్రి, తిరుపట్టూర్ ఏఐడిఎంకే అభ్యర్థి రాజ కన్నప్పన్ కూడా డిఎంకె అభ్యర్థి పెరియ కరుప్పన్ పైన ఇలాంటి పిటిషనే దాఖలు చేశారు.