తగ్గని శరద్ పవార్: కాంగ్రెస్పై ప్రఫుల్ పటెల్ అసంతృప్తి
కాంగ్రెసు సంకీర్ణ ప్రభుత్వం నియమాలు పాటించడం లేదని విమర్శించారు. తాము తొలి నుండి యుపిఏలోనే ఉంటున్నామని, ఇక ముందు కూడా ఉంటామని చెప్పారు. తాము రాజీనామాలు చేసింది పదవుల కోసమే అనడం సరికాదన్నారు. అది విషయమే కాదన్నారు. కాంగ్రెసును తాము ఆపద సమయాల్లో పలుమార్లు ఆదుకున్నామని, కాంగ్రెసు తీరులో మార్పు రావాలన్నారు.
బేరసారాల కోసం తాము రాజీనామాలు చేశామని ప్రచారం జరగడం అవాస్తవమన్నారు. ఎంపీల సంఖ్యను బట్టి తమ పార్టీ అధినేత శరద్ పవార్కు ప్రాధాన్యత ఇవ్వడం కాదని, ఆయన చోటా మోటా నేత కాదన్నారు. తాము ఎప్పుడు పదవుల కోసం ఆశపడలేదన్నారు. నెంబర్ టు కోసమో, శాఖల మార్పుల కోసమో తాము పట్టుబట్టడం లేదన్నారు. సంకీర్ణ విలువలు పాటించాలని మాత్రమే కాంగ్రెసుకు సూచిస్తున్నామన్నారు.
తమ ఇబ్బందులను, సమస్యలను పలుమార్లు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ల దృష్టికి తీసుకు వెళ్లామని చెప్పారు. గురువారం సాయంత్రం కూడా పవార్ ప్రధానితో సమావేశమయ్యారని, ఉదయం సోనియాతో సమావేశమయ్యారని చెప్పారు. సాయంత్రం మరోసారి తమ పార్టీ నేతలం సమావేమయై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.