ఒత్తిడి ఎత్తుగడలుకావు, యుపిఎలో ఉంటాం: ప్రఫుల్
ముంబై విమానాశ్రయంలో ప్రఫుల్ పటేల్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఎన్సీపి యుపిఎలో భాగస్వామ్య పక్షమని, భాగస్వామ్య పక్షంగా ఉంటామని చెప్పారు. గత ఎనిమిదేళ్లుగా కాంగ్రెసుకు విశ్వసనీయమైన మిత్రపక్షంగా ఉన్న ఎన్సీపి తాము ప్రభుత్వం నుంచి తప్పుకుంటామని చెప్పడంతో సంక్షోభం ప్రారంభమైంది.
తాము యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీతో మాట్లాడామని, తాము యుపిఎపై ఒత్తిడి పెడుతున్నామని కాంగ్రెసు సీనియర్ నాయకులెవరూ అనలేదని ప్రఫుల్ పటేల్ అన్నారు. తాము ఒత్తిడి రాజకీయాలు చేస్తున్నామని కాంగ్రెసు నాయకులెవరైనా అంటే అది సరి కాదని ఆయన అన్నారు.
కాగా, శరద్ పవార్ మీడియాతో మాట్లాడలేదు. శరద్ పవార్తో ఎన్సీపి నాయకులు అజిత్ పవార్, ఛగన్ భుజబల్, ప్రఫుల్ పటేల్, ఆర్ పాటిల్ సమావేశమవుతున్నారు. తాము యుపిఎలో ఉంటామని శరద్ పవార్ సోనియాకు రాసిన లేఖలో కూడా స్పష్టం చేశారు. భాగస్వామ్య పక్షాలతో కాంగ్రెసు సమన్వయంతో వ్యవహరించడం లేదని, భాగస్వామ్య పక్షాలను సంప్రదించడం లేదని ఆయన ఫిర్యాదు చేశారు.