జగన్ సిఎం కాగానే..., అందుకే పార్టీ వీడా: కొడాలి నాని
ఇటీవల నానిని టిడిపి బహిష్కరించిన విషయం తెలిసిందే. బహిష్కరణకు గురైన అనంతరం ఆయన బహిరంగంగా తన నిర్ణయాన్ని చెప్పారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయ సాధన కోసం రెండుసార్లు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తాను పార్టీ అధికారంలోకి రాకపోవడంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయలేక పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
తెలుగుదేశం పార్టీకి రాజకీయ భవిష్యత్తు లేదన్నారు. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాటలు ప్రజలు విశ్వసించడం లేదని విమర్శలు గుప్పించారు. వచ్చే సాధారణ ఎన్నికలలో వైయస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారన్నారు. అప్పుడు తాను రూ.250 కోట్లతో గుడివాడ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. పుట్టిన ప్రదేశం రుణం తీర్చుకోవడానికి తల్లి వంటి తెలుగుదేశం పార్టీని వీడినట్లు చెప్పారు.
కాగా ఇటీవల కొడాలి నాని జగన్కు జై కొట్టిన విషయం తెలిసిందే. దాంతో అతనిని పార్టీ నుండి అధిష్టానం బహిష్కరించింది. అప్పటి నుండి ఆయన బహిరంగంగా తాను జగన్ పార్టీ నుండి పోటీ చేస్తానని ఇప్పటి వరకు చెప్పలేదు. ఆదివారం బహిరంగ సభలో ప్రకటన చేశారు.