నన్ను ఇరికించి, ఏరాసును తప్పించారు: లక్ష్మీ నరసింహారావు
అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) జాయింట్ డైరెక్టర్ సంపత్ కుమార్ తన కుటుంబాన్ని చిత్రహింసలకు గురి చేస్తానని బెదిరించారని ఆయన ఆరోపించారు. ఎసిబి అధికారులు అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ప్రతిని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తిరస్కరించింది. గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన బెయిల్ వ్యవహారంలో జడ్జి లక్ష్మీ నరసింహా రావును అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) అధికారులు జులై 12వ తేదీ ఉదయం అరెస్టు చేశారు.
లక్ష్మీ నరసింహ రావు సిటీ సివిల్ కోర్టు ప్రాంగణంలో స్మాల్ కాజస్ కోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. గాలి బెయిల్ కేసులో ఆయనపై ఆరోపణలు రావడంతో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు జులై 11వ తేదీన వేటు వేసింది. ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గాలి బెయిల్ కేసులోనే జడ్జి ప్రభాకర రావును కూడా ఎసిబి శ్రీకాకుళం జిల్లాలో అరెస్టు చేసింది.
గాలి బెయిల్ కేసులో ప్రభాకర రావుపై ఆరోపణలు రావడంతో హైకోర్టు అతనిని శ్రీకాకుళం ఫ్యామిలీ కోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఆ తర్వాత రోజు అక్కడ బాధ్యతలు స్వీకరించడానికి వెళ్లగా అంతలోనే సస్పెండ్ చేస్తూ వేటు వేసింది. ఈరోజు అతనిని ఎసిబి అరెస్టు చేసింది. ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డి బంధువు దశరాథరామిరెడ్డిని ఎసిబి అరెస్టు చేసింది. కర్ణాటకకు చెందిన ఇద్దరు శాసనసభ్యుల కోసం గాలింపు జరుపుతోంది.