విజయమ్మకు అడుగడుగునా అడ్డంకులు, భారీ భద్రత
సుమారు ఇరవై నుండి ముప్పై వాహనాలతో ఆమె సిరిసిల్లకు బయలుదేరారు. అయితే ఆమెకు హైదరాబాదు నుండే అడ్డంకులు ఎదురయ్యాయి. ఆమె దీక్షను అడ్డుకుంటామని ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు, టిఆర్ఎస్వీ విద్యార్థులు పలుచోట్ల విజయమ్మను అడ్డుకున్నారు. హైదరాబాదు నగరం పూర్తిగా దాటక ముందే ఆమెను మూడు, నాలుగు చోట్ల అడ్డుకున్నారు.
షామీర్పేటకు చేరుకునే వరకు బొల్లారం, అల్వాల్, హకీంపేటల వద్ద ఆమెను అడ్డుకున్నారు. హకీంపేట వద్ద భారీగా తెరాస కార్యకర్తలు రోడ్డు పైకి వచ్చి విజయమ్మ కాన్వాయ్ను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నగరం ఔట్ స్కర్ట్స్లలోని తూంకుంటలోనూ విజయమ్మ కాన్వాయ్ను తెరాస అడ్డుకుంది. ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో కాన్వాయ్ నగరం దాటింది.
మరోవైపు విజయమ్మ దీక్ష నేపథ్యంలో సిరిసిల్లలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వేలాది మంది పోలీసులను ఆ చిన్న పట్టణంలో మోహరించారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ను అందుబాటులో ఉంచారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా భారీగా తెరాస కార్యకర్తలను, నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యేలు కెటిఆర్, హరీష్ రావు, విద్యాసాగర్ రావు తదితరులను హౌస్ అరెస్టు చేశారు. హైదరాబాదులోని మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద ఎబివిబి విద్యార్థులు విజయమ్మ దీక్షను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు.