ప్రణబ్కు 14 మంది ఓటు: చర్యలుంటాయని సిఎం
కర్ణాటకకు చెందిన 14 మంది శాసనసభ్యులు క్రాస్ ఓటింగుకు పాల్పడిన సంఘటన బిజెపిని ఇరకాటంలో పెట్టింది. పార్టీలో సంక్షోభం ఇంకా ముగిసిపోలేదని చెప్పడానికి ఇది సంకేతాలిస్తోందని అంటున్నారు. క్రాస్ ఓటింగుకు పాల్పడిన శాసనసభ్యుల్లో మూడు గ్రూపులకు చెందినవారున్నారని చెబుతున్నారు. యడ్యూరప్ప, సదానంద గౌడ వ్యతిరేక వర్గాలు క్రాస్ ఓటింగుకు పాల్పడినవారిలో ఉన్నారని చెబుతున్నారు.
ప్రణబ్ ముఖర్జీకి ఓటేసిన మరో వర్గం మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి చెందిందని, వారంతా శ్రీరాములుకు విధేయులుగా ఉన్నారని చెబుతున్నారు. మాజీ ఆరోగ్య మంత్రి శ్రీరాములు సొంత పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. శ్రీరాములుకు విధేయంగా ఉంటూనే కొంత మంది శాసనసభ్యులు బిజెపిలో కొనసాగుతున్నారు.
రెండో వర్గం మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు చెందిన శాసనసభ్యులని, వీరు మంత్రిపదవులు దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. సదానంద గౌడ ఉద్వాసనపై ఆగ్రహంగా ఉన్న కొంత మంది శాసనసభ్యులు కూడా ప్రణబ్ ముఖర్జీకి ఓటేశారని తెలుస్తోంది.
క్రాస్ ఓటింగు వ్యవహారాన్ని పరిశీలించడానికి ఓ బృందాన్ని బెంగళూర్కు పంపిస్తామని, ముఖ్యమంత్రి షెట్టర్ ఓ సమావేశం కూడా ఏర్పాటు చేస్తారని బిజెపి ఢిల్లీ నాయకులు అంటున్నారు. కర్ణాటకలో ప్రణబ్ ముఖర్జీకి 117 ఓట్లు రాగా, సంగ్మాకు 103 ఓట్లు వచ్చాయి.