యుపిఎలోనే ఉంటాం కానీ, ఆ తర్వాతే..: ప్రఫుల్
ఈ రోజు జరిగిన సమావేశంలో ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని, రేపు గానీ ఎల్లుండి గానీ మరోసారి పార్టీ నేతలతో సమావేశమై తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. మహారాష్ట్రలో కొన్ని సమస్యలున్నాయని, ఆ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. మహారాష్ట్రకు చెందిన నాయకులు తమ సమావేశంలో పాల్గొనాల్సి ఉందని, వారి అభిప్రాయాలు కూడా తీసుకుని తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు.
యుపిఎలో తాము బాధ్యతాయుతమైన భాగస్వామ్య పక్షంగా ఉన్నామని, అలాగే కొనసాగుతామని ఆయన చెప్పారు. ఈ విషయంలో వస్తున్న ఊహాగానాల్లో నిజం లేదని ఆయన అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం సజావుగా నడవాలని తాము కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. అగాథా సంగ్మా ఇక్కడికి వచ్చారని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారని ఆయన అన్నారు.
తమ అధినేత శరద్ పవార్ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్కు అన్ని విషయాలూ చెప్పినట్లు ఆయన తెలిపారు. కొంత మంది కాంగ్రెసు నాయకులు బాధ్యతారహితమైన ప్రకటనలు చేస్తున్నారని, ఇది కేంద్ర నాయకత్వాన్ని ప్రభావితం చేయకూడదని ఆయన అన్నారు.