జగన్తో అప్పుడే తెగతెంపులు! అతనిది వేరే పార్టీ: వంశీ
భవిష్యత్తులో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్ష పదవిని కూడా ఎన్నికల ద్వారా నియమించే యోచన ఉందని చెప్పారు. గతంలో ఎన్ఎస్యుఐ, యువజన కాంగ్రెసు రాష్ట్ర అధ్యక్ష పదవులు నామినేషన్ పద్ధతిలో భర్తీ చేసే వారని, అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలని ఎన్నికల ద్వారా నియామకాలు జరగాలని రాహుల్ నిర్ణయించారన్నారు. యువజన కాంగ్రెసు ఎన్నికలలో రాష్ట్ర కమిటీ కోసం 26 మంది పోటీ పడగా... తనతో సహా 10 మంది విజయం సాధించారన్నారు.
తన విజయం ప్రతి కార్యకర్త విజయమని వంశీ అన్నారు. కాంగ్రెసు పార్టీ రాష్ట్ర అధ్యక్షులను కూడా ఎన్నికల ద్వారానే నియమించాలని రాహుల్ భావిస్తున్నారన్నారు. తాము ప్రభుత్వానిసి, కార్యకర్తలకు మధ్య వారధిగా పని చేస్తామని వంశీ చెప్పారు. పది రోజుల్లో కొత్త కమిటీ కార్యవర్గ సమావేశం ఉంటుందని, ఆ సమావేశానికి పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక అతిథులుగా హాజరవుతారని వివరించారు.
2014 సార్వత్రిక ఎన్నికలలో యువతకు పెద్ద పీట వేస్తారన్నారు. తాను కరడుగట్టిన కాంగ్రెసు వాదినని, ఓదార్పు యాత్రకు అనుమతించాలని సోనియా గాంధీకి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాసినప్పుడే ఆయనకు దూరమయ్యానని చెప్పారు. జగన్ కాంగ్రెసులో ఉన్నప్పుడు ఆయనతో కలిసి పని చేశానని, ఇప్పుడు ఆయనది వేరే పార్టీ అన్నారు.
ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రిలయన్స్ సంస్థలపై దాడులు నిర్వహించాలంటూ ఎస్సెమ్మెస్లు ఇచ్చాననే ఆరోపణలు అవాస్తవమన్నారు. ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ ఎన్నికలలో ఇరవై శాతం స్థానాల్ని యువతకే కేటాయించారన్నారు. త్వరలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.