తిరుమలలో టిటిడి ఉద్యోగుల క్రైస్తవ మత ప్రచారం
టిటిడిలో ఉద్యోగం చేస్తున్న ఈశ్వరయ్య, యశోదమ్మ, కృష్ణయ్య అనే ముగ్గురు వ్యక్తులు గత కొంతకాలంగా అధికారుల కళ్లు గప్పి క్రైస్తవ మత ప్రచారం చేస్తున్నారట. ఈ విషయం తెలిసిన విజిలెన్స్ అధికారులు మంగళవారం ఎఫ్ టైప్ క్వార్టర్సులలో ఉంటున్న వారి ఇళ్లలో సోదాలు చేశారు.
ఈ సోదాలలో విజిలెన్స్ అధికారులు క్రైస్తవ మతానికి చెందిన పలు పోస్టర్లు, కరపత్రాలు తదితర ప్రచార సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయం తెలియగానే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వారు ఉంటున్న క్వార్టర్స్ను ఖాళీ చేయించారు.
కాగా టిటిడి ఉద్యోగల అన్య మత ప్రచారంపై తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులు, హిందూవాదులు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తిరుమల పరిధిలో అన్య మత ప్రచారానికి ఆస్కారం లేనప్పటికీ ఉద్యోగులే ఇలా చేయడం దారుణమన్నారు.
ఉద్యోగులే అన్యమత ప్రచారం చేయడంపై టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యమత ప్రచారం చేస్తున్న ముగ్గురిని తిరుమల నుండి తిరుపతికి బదలీ చేస్తున్నట్లు ప్రకటించారు.