గాలి బెయిల్ డీల్: ఎమ్మెల్యేలకు ఎసిబి నోటీసులు
సోమశేఖర రెడ్డి, సురేష్బాబు విదేశాలకు పారిపోకుండా ఎసిబి ఇది వరకే అంతర్జాతీయ విమానాశ్రయాలకు లుకవుట్ నోటీసులు జారీ చేసింది. గాలి జనార్దన్ రెడ్డి బంధువు, వ్యాపారి దశరథరామిరెడ్డిని ఎసిబి ఇటీవల అరెస్టు చేసింది. కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ కుంభకోణం కేసులో కీలక పాత్ర పోషించిన ఆయన సోదరుడు గాలి సోమశేఖర రెడ్డి, కంప్లి శాసనసభ్యుడు సురేష్ బాబులు అజ్ఞాతంలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో వరుస అరెస్టులు కొనసాగుతున్న నేపథ్యంలో వారిద్దరూ కొద్ది రోజులుగా ఎవరికీ అందుబాటులోకి రావడం లేదు.
ఈ కేసులో ఇప్పటికే ఎసిబి పలువురిని అరెస్టు చేసింది. దశరథరామిరెడ్డిని ఎసిబి అధికారులు ఆదివారం కోర్టులో హాజరుపర్చింది. దీంతో అతనికి వచ్చే నెల 3వ తేది వరకు రిమాండ్ విధించారు. అతనిని చర్లపల్లి జైలుకు తరలించారు. గాలికి బెయిల్ ఇప్పించేందుకు ఇరవై కోట్లు మాత్రమే కాదని రూ.100 కోట్లు ఇచ్చేందుకు కూడా సిద్ధపడినట్లుగా ఇటీవల అరెస్టయిన జిల్లా జడ్జి తన వాంగ్మూలంలో చెప్పారు.
చంచల్గూడ జైలులో ఉన్నప్పుడు ములాఖత్లో భాగంగా తనను కలిసేందుకు వచ్చిన అనుచరులకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇప్పించాలని, ఇంత ఖర్చయినా ఫర్వాలేదని గాలి చెప్పేవాడని తెలుస్తోంది. దాంతో ఈ బాధ్యత ఆయన సోదరుడు సోమశేఖర రెడ్డి, కర్నాటకలోని కంప్లి శాసనసభ్యుడు సురేష్లు తమ భుజానికి ఎత్తుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి వరకూ వెల్లడయిన అంశాల ప్రకారం బెయిల్ కోసం వీరు వేర్వేరు వ్యక్తుల ద్వారా మూడుసార్లు ప్రయత్నాలు చేశారు.