'మహా' మలుపు: చవాన్పై ఎమ్మెల్యేల తిరుగుబాటు
మహారాష్ట్ర ప్రభుత్వం పనితీరుపై ఎన్సీపి ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి మార్పును ఎన్సీపి కోరుకుంటున్నట్లు తాజా పరిణామాన్ని బట్టి అర్థమవుతోంది. మహారాష్ట్ర శానససభలో కాంగ్రెసుకు 82 మంది శానససభ్యులున్నారు. వీరిలో 62 మంది తిరుగుబాటు ప్రకటించారు. 2010 నవంబర్లో అశోక్ చవాన్ స్థానంలో పృథ్వీరాజ్ చవాన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే.
పృథ్వీరాజ్ చవాన్పై తిరుగుబాటు ప్రకటించిన 62 మంది శాసనసభ్యులు కూడా అశోక్ చవాన్ వర్గానికి చెందినవారని తెలుస్తోంది. అశోక్ చవాన్ పేరును ఆదర్స్ కుంభకోణంలో చేర్చడంతో వారు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఆదర్శ్ కుంభకోణం కేసు దర్యాప్తు విషయంలో అశోక్ చవాన్ పట్ల అనుసరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ ఈ నెలారంభంలో జరిగిన కాంగ్రెసు శాసనసభా పక్ష సమావేశం నుంచి 12 మంది శాసనసభ్యులు బయటకు వెళ్లిపోయారు.
మహారాష్ట్ర కాంగ్రెసులో తలెత్తిన సంక్షోభంపై ఎన్సీపి ఇంకా స్పందించాల్సి ఉంది. ఆ పార్టీ వేచి చూసే ధోరణిని అవలంబిస్తోంది. కాంగ్రెసుతో పొత్తుపై 48 గంటల తర్వాత చెప్తామని ఎన్సీపి సోమవారం తెలిపింది. తమ పట్ల కాంగ్రెసు అనుసరిస్తున్న వైఖరిపై ఎన్సీపి అసంతృప్తితో ఉంది.