తప్పుకుంటామని కాంగ్రెసుకు ఎన్సీపి హెచ్చరిక
మహారాష్ట్రలో గత 13 ఏళ్లుగా కాంగ్రెసు, ఎన్సీపి సంకీర్ణం మనుగడలో ఉంది. యుపిఎలోని కాంగ్రెసేతర భాగస్వామ్య పక్షాలు తమ డిమాండ్ల పట్ల సానుకూలంగా ఉన్నారని, ఆ పార్టీలతో తాము ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని ఎన్సీపి నాయకులు చెబుతున్నారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్కు, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాసిన లేఖల్లో శరద్ పవార్ లేవనెత్తిన అంశాలపై తెరచాటున ఏ విధమైన మంతనాలు జరగడం లేదని వారంటున్నారు.
శరద్ పవార్ స్థాయి నాయకుడు రెండు మంత్రి వర్గ సమావేశాలకు గైర్హాజరు కావడమనేది బాధ్యత గల తమ పార్టీకి మంచిది కాదని, దాంతో ఉత్కంఠకు తెర దించాలని శరద్ పవార్ భావిస్తున్నారని, అందువల్లనే రేపటి వరకు తాము గడువు విధించామని ఎన్సీపి నేతలు అంటున్నారు. తమ పార్టీని బలోపేతం చేసుకుంటామని అంటూ శరద్ పవార్, ప్రఫుల్ పటేల్ గత వారం మంత్రి పదవులకు రాజీనామాలు చేశారు.
పవార్కు రెండో స్థానం ఇవ్వాలని పట్టుబడుతూ కాంగ్రెసుపై తమ పార్టీ ఒత్తిడి పెడుతోందని వచ్చిన వార్తలను ప్రఫుల్ పటేల్ ఖండించారు. యుపిఎ భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం అవసరమని తాము అంటున్నామని ఆయన చెప్పారు.