పెద్దలతో మాట్లాడ్తా: పార్థ, న్యాయసలహాను బట్టి...: సిఎం
కోర్టు తీర్పును గౌరవించి తాను జరిమానా చెల్లించినట్లు ఆయన తెలిపారు. కోర్టు తనను దోషిగా నిర్ధారించిన నేపథ్యంలో తన భవిష్యత్తుపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితోనూ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతోనూ మాట్లాడుతానని, ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. తాను రాజకీయాల్లోకి రాక ముందు జరిగిన వ్యవహారంలో ఈ కేసు నడిచిందని ఆయన చెప్పారు.
తాను రాజకీయాల్లోకి రాక ముందు 1994లో కెపిఆర్ సంస్థను స్థాపించి దానికి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నానని, అది వ్యక్తిగత వ్యాపారాలకు సంబంధించిన కేసు అని, స్విట్జర్లాండ్ యంత్రం కొనుగోలుకు సంబంధించిన ఒప్పందమని, తమను బ్యాంకులు ఇబ్బందులకు గురి చేశాయని ఆయన అన్నారు. ఆర్థిక నేరాల కోర్టు తీర్పుపై తాను హైకోర్టుకు వెళ్తానని, దీనిపై న్యాయవాదులతో మాట్లాడుతానని ఆయన చెప్పారు. తన భవిష్యత్తును పార్టీ, ప్రభుత్వం తేలుస్తాయని ఆయన చెప్పారు.
ఇదిలా వుంటే, కృష్ణా జిల్లాకు ఆబ్కారీ శాఖ అచ్చి రాదనే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం పార్థసారథి ఆబ్కారీ శాఖ మంత్రిగా ఉన్నారు. డిస్టిల్లరీస్ కేసులో కృష్ణా జిల్లాకే చెందిన కనుమూరి బాపిరాజు 1989లో ఆబ్కారీ మంత్రిగా రాజీనామా చేశారు. అలాగే, 1998లో రఘురామ్ ఏలూరు నోట్ల కట్టల కేసులో చిక్కుకుని ఆబ్కారీ మంత్రిగా రాజీనామా చేశారు.
మంత్రి పార్థసారథి రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. కోర్టు దోషిగా నిర్ధారించిన తర్వాత మంత్రిగా కొనసాగే నైతిక అర్హత పార్థసారథికి లేదని ఆయన అన్నారు. ప్రభుత్వం కళంకిత మంత్రులకు న్యాయ సహాయం అందిస్తోందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు.