ఫెరా ఉల్లంఘన: పార్థసారథికి 2 నెలలు జైలు, జరిమానా
కోర్టు ఆయనకు రూ.5లక్షల 15వేల జరిమానాతో పాటు రెండు నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. ఫెరా ఉల్లంఘన కేసులో కెపిఆర్ సంస్థను మొదటి నిందితుడిగా పేర్కొంటూ సంస్థకు రూ.5 లక్షలు, పార్థసారథిని రెండో నిందితుడిగా పేర్కొంటూ అతనికి రూ.5 వేల జరిమానా విధించింది. మరో కేసులో రూ.10వేల జరిమానా విధించింది. జరిమానా కట్టని పక్షంలో మరో పది నెలలు జైలు శిక్ష విధించింది. అయితే తాత్కాలికంగా జైలు శిక్షను నిలుపుదల చేస్తూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు వీలుగా ఈ బెయిల్ మంజూరు చేసింది. ఇందుకోసం ఓ నెల రోజులు గడువు కూడా ఇచ్చింది. ఇందుకుగాను మంత్రి పూచికత్తు కోర్టుకు సమర్పించారు. కోర్టు ఆయనను నేరస్థుడిగా నిర్ధారించడంతో ఆయన ఏ క్షణంలోనైనా రాజీనామా చేసే అవకాశముందని చెబుతున్నప్పటికీ ఆస్కారం లేదని మరికొందరు అంటున్నారు.
పెరా నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఆర్థిక నేరాల కోర్టు సోమవారం మంత్రికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే తాను ప్రభుత్వ కార్యకలాపాలలో బిజీగా ఉన్నందువల్ల కోర్టుకు హాజరు కాలేదని మంత్రి వివరణ ఇచ్చినందువల్ల వారెంట్ వెనక్కి తీసుకుంది. కాగా ఫెరా నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఈడి గతంలో పార్థసారథికి మూడు లక్షల రూపాయల జరిమానా విధించింది. దానిని మంత్రి చెల్లించలేదు. అంతేకాకుండా పలుమార్లు కోర్టుకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ హాజరు కాలేదు. విచారణకు సహకరించలేదు.
దీంతో ఈడి ఆర్థిక నేరాల కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈడి పిటిషన్ స్వీకరించిన కోర్టు మంత్రికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. పార్థసారథి 1994లో కెపిఆర్ టెలి ప్రోడక్ట్స్ పేరుతో ఓ కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీ కోసం రూ.60 లక్షల మిషనరీని కొనుగోలు చేశారు. ఈ కొనుగోలులో ఆయన పెరా నిబంధనలు ఉల్లంఘించారని అభియోగాలు ఉన్నాయి. ఆ కంపెనీ ఎండిగా ఆయనపై ఈడి ఆయనపై కేసు పెట్టింది. రూ.3 లక్షల జరిమానా విధించింది.
ఈ కేసు 2002 నుండి కేసు కొనసాగుతోంది. మంత్రి పార్థసారథి అప్పటి నుండి ఇప్పటి వరకు జరిమానా కట్టక పోగా ఇంత వరకు విచారణ నిమిత్తం కోర్టుకు హాజరు కాలేదు. దీంతో ఈడి కోర్టును ఆశ్రయించింది. ఆర్థిక నేరాల కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ రోజు ఆయన కోర్డుకు హాజరు కావడంతో విచారణ జరిపి నిందితుడిగా నిర్ధారించింది.