పిచ్చోడినంటున్నారు: హెచ్చార్సీలో కెఏ పాల్ ఫిర్యాదు
ఓ హత్య కేసులో విచారణ ఖైదీగా ఒంగోలు జైలులో ఉన్న తనకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయని, అక్కడ సరైన సౌకర్యాలు లేనందున గుంటూరుకు తీసుకెళ్లారన్నారు. అక్కడా వసతులు లేకపోవడంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని కోరానన్నారు. గాంధీ ఆస్పత్రి వైద్యులు నిమ్స్కు తరలించారని తెలిపారు. అయితే, నిమ్స్ వైద్యులు తనకు పిచ్చి ఉందంటూ ఎర్రగడ్డ పిచ్చాస్పత్రిలో చేర్పిస్తామని గేలి చేసినట్లు వాపోయారు. కొందరు జైలు అధికారులు తనను చంపాలని చూస్తున్నారని, అందువల్ల హైదరాబాద్కు తరలించేలా ఆదేశాలివ్వాలని హెచ్చార్సీని అభ్యర్థించారు.
కాగా తాను పిచ్చి వాడిని కాదని, తనకు పిచ్చి లేదని చికిత్స కోసం నిమ్స్ ఆసుపత్రికి వస్తే ఇక్కడ చికిత్స చేయకుండా పిచ్చిఉందని ఎర్రగడ్డకు పంపుతున్నారని కెఎపాల్ మూడు రోజుల క్రితం చెప్పిన విషయం తెలిసిందే. పోలీసులు కక్ష గట్టి తనని ఎర్రగడ్డకు తీసుకెళ్తున్నారని ఆయన అన్నారు. తనను చంపడానికి కుట్రచేస్తున్నారని పాల్ ఆరోపించారు. రెండేళ్ల క్రితం జరిగిన హత్య కేసులో ఇప్పుడు తనని అరెస్ట్ చేయడమేంటని ఆయన అడిగారు. ఇదంతా రాజకీయ కుట్ర ఆయన అన్నారు.
కెఎ పాల్ను పోలీసులు మే మూడో వారంలో అరెస్టు చేశారు. తన సోదరుడు డేవిడ్ రాజు హత్య కేసులో ఆయనను పోలీసులు ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో అరెస్టు చేశారు. డేవిడ్ రాజ్ రెండేళ్ల క్రితం మహబూబ్నగర్ జిల్లా కొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో హత్యకు గురయ్యాడు. ఆ హత్య అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. పాల్ తమ్ముడు డేవిడ్ రాజు 2010 ఫిబ్రవరిలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. డేవిడ్ రాజుకు, కెఎ పాల్కు మధ్య ఆస్తి తగాదాలున్నాయి. ఈ ఆస్తి తగాదాల కారణంగానే డేవిడ్ రాజును కెఎ పాల్ హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు.