నెల్లూరు ఘటన: 12 గంటలకుపైగా బస్సులో శవాలు
దర్యాప్తు పేరుతో పోస్టుమార్టం చేయించే విషయంలో జాప్యం చేయడం పట్ల మృతుల బంధువులు, ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు వస్తే గానీ ముందుకు కదలబోమని కింది స్థాయి అధికారులు, సిబ్బంది చెప్పారు. ఎస్పీ హైదరాబాదులో ఉండడంతో చాలా ఆలస్యంగా వచ్చారు. బస్సును ఆస్పత్రి వద్దనే ఉంచారు. కానీ శవాలకు పోస్టుమార్టం చేయించే విషయంలో మాత్రం తీవ్ర జాప్యం జరిగింది.
ఈ ఘాతుకానికి పాల్పడింది సైకో సాంబ కాదని నెల్లూరు జిల్లా ఎస్పీ చెప్పారు. దుండగుడి కోసం గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు. తమిళనాడు పోలీసులకు కూడా సమాచారం అందించామని ఆయన చెప్పారు. ఇదిలావుంటే, చిత్తూరు జిల్లా వరదాయపాలెం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి ఓ అనుమానాస్పద వ్యక్తి ప్రవేశించాడని కొందరు పోలీసులకు సమాచారం అందించారు. అతని చొక్కా వెనక భాగం చినిగి ఉందని, రక్తం మరకలు కూడా కనిపించాయని వారు చెప్పినట్లు సమాచారం. దీంతో అటవీ ప్రాంతంలో పోలీసులు, అటవీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
అటవీ ప్రాంతం వందల హెక్టార్లలో విస్తరించి ఉంది. వరదాయపాలెం, సత్యవేడు పోలీసులు గాలింపు జరుపుతున్నారు. అదనపు బలగాలను కూడా రప్పించినట్లు సమాచారం. చిత్తూరు జిల్లా సరిహద్దుల్లో కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తమిళనాడు రాష్ట్రంలోని ఊతకోటలో పోలీసులు అన్వేషణ సాగిస్తున్నారు.