చిక్కుల్లో స్వామి గౌడ్: విచారణకు హైకోర్టు ఆదేశం
టిఎన్జివో హౌసింగ్ సొసైటీ స్థలాల కేటాయింపుల్లో స్వామి గౌడ్ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. సొసైటీలోని అక్రమాలను సహకార శాఖ అధికారి కిరణ్మయి ధ్రువీకరించారు. ఈ మేరకు ఆమె ప్రభుత్వానికి నివేదికను అందజేశారు. ఉద్యోగులకు కేటాయించిన ఫ్లాట్లలో అవకతవకలు జరగాయంటూ, సొసైటీని రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఇంతకు ముందు కోర్టు ఆదేశించింది.
కోర్టు ఆదేశాల మేరకు విచారణ జరిపి, ప్లాట్ల కేటాయింపులో భారీ అవకతవకలు జరిగాయని విచారాధికారి కిరణ్మయి నిర్ధారించారు. 1991లో గచ్చిబౌలి, గోపన్నపల్లెలో టీన్జీవోలకు 160 ఎకరాలు కేటాయింపు జరిగింది. సభ్యత్వ నమోదు పుస్తకాన్ని నిర్వహించకుండా ఇష్టానుసారంగా ప్లాట్లు కేటాయించినట్లు నివేదికలో కిరణ్మయి తెలిపారు. 240 ప్లాట్లను బినామీ పేర్లతో కేటాయించారని తెలిపారు. దొంగ అఫిడవిట్లు ఇచ్చినట్లు విచాణలో వెల్లడించారు.
ఇతర జిల్లాల టీన్జీవోలు, గెజిటెడ్ అధికారులుకు ప్లాట్లు కేటాయించినట్లు నిర్ధారణ అయినట్లు నివేదికలో కిరణ్మయి స్పష్టం చేశారు. సీనియారిటీ లిస్టు కూడా ఇవ్వలేదని కిరణ్మయి తన నివేదికలో తెలిపారు. ఆమె ప్రభుత్వానికి వేయి పేజీల నివేదికను సమర్పించారు. టీఎన్జీవో సోసైటీ స్థలాల కేటాయింపులో తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని టీన్జీవో నేత స్వామిగౌడ్ అప్పట్లో అన్నారు. తనకు నివేదిక ఇవ్వకుండానే లీక్ చేశారని స్వామిగౌడ్ అప్పట్లో ఆరోపించారు.