టిటిడి సిబ్బందిలో వందమంది వరకు అన్యమతస్తులు
వీరిపై చట్టపరంగా వేటు వేసే దిశగా అడుగులు వేస్తోంది టిటిడి. ఇటీవల ముగ్గురు క్రైస్తవ మత ప్రచారకులు దొరికిన నేపథ్యంలో టిటిడి అధికారులు సిబ్బంది నివాసాలను జల్లెడ పడుతోంది. ఎక్కడెక్కడ ఎవరున్నారన్న విషయంపై ఆరా తీస్తోంది. కాగా తిరుమల శ్రీవారి దర్శనానికి అన్యమతస్తులు వచ్చిన పక్షంలో డిక్లరేషన్ పైన తప్పని సరిగా సంతకం చేయాలని టిటిడి అధికారులు స్పష్టం చేశారు.
గురువారం తిరుమలలో ఆయన విలేకరులతో మాట్లాడారు. డిక్లరేషన్ నిబంధనను ఇకపై తప్పనిసరిగా అమలు చేస్తామన్నారు. జివో ఎంఎస్ నెంబరు 311, దేవాదాయశాఖ రెవెన్యూ విభాగం నిబంధన 136 మేరకు అన్య మతస్తులు శ్రీవారి దర్శనానికి వచ్చే సమయంలో వైకుంఠంలో ధ్రువీకరణ పత్రంపై సంతకం చేయాల్సి ఉంటుందని వివరించారు. ఇందుకు సంబంధించిన దస్త్రాలను ఇకపై జేఈవో, పేష్కారు, ఉపవిచారణ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ధ్రువీకరణపై సంతకం చేయని వారిని ఎట్టి పరిస్థితులలోనూ దర్శనానికి అనుమతించేది లేదన్నారు.
మరోవైపు తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గురువారం ప్రముఖ మాజీ క్రికెటర్ రవిశాస్త్రి, రేమాండ్స్ అధినేత సింఘానియాలను విశ్రాంతి గృహంలో కలిశారు. అంతకుముందు రవిశాస్త్రి, సింఘానియాలు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిని కలిసేందుకే వచ్చారా అని రమణ దీక్షితులను మీడియా ప్రశ్నించగా కాదని చెప్పారు.