ఆగని అస్సాం ఘర్షణలు: 44కు చేరిన మృతులు
44 మంది మృత్యువాతకు ఇరు వర్గాల నాయకులు బాధ్యత వహించాలని ఆర్ కె సింగ్ చెప్పారు. కాగా వారం రోజులుగా అస్సాంలోని నాలుగు జిల్లాల్లో బోడో, మైనార్టీ వర్గాల మధ్య అల్లర్లు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. గడిచిన ఇరవై నాలుగు గంటలలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోలేదని హోంమంత్రి చిదంబరం కూడా ప్రకటించారు. ముఖ్యమంత్రి తరుణు గొగోయ్ అల్లర్ల ప్రాంతాలను పరిశీలించారని, తనను కలిసిన అనంతరం నివేదిక ఇస్తారని చెప్పారు.
అల్లర్ల కారణంగా రోడ్డున పడ్డ బాధితులకు ప్రభుత్వం సహాయం చేస్తుందని హోం సెక్రటరీ ఆర్ కె సింగ్ చెప్పారు. అల్లర్ల కారణంగా నాలుగు జిల్లాల్లో 1.71 లక్షల మంది రోడ్డున పడ్డారన్నారు. ఇప్పటికే అల్లర్ల ప్రాంతాలలో ప్రశాంతత నెలకొల్పేందుకు, బాధితులకు సహాయం చేసేందుకు 4,200 మంది పార్లమెంటరీ పర్సనల్స్ వెళ్లారని, ఈ సాయంత్రానికి 2,200 మంది సెక్యూరిటీ కూడా వెళ్లనుందని చెప్పారు.
అల్లర్లపై యాక్షన్ తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్న ఆరోపణలను హోంమంత్రిత్వ శాఖ ఖండించింది. వంద మంది వరకు ఆందోళనకారులను పోలీసులు ఇప్పటి వరకు అరెస్టు చేశారు. అసోం సంఘటనలను గుజరాత్ అల్లర్లతో పోల్చతగదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు. గుజరాత్లో ఆనాడు సీఎం నరేంద్ర మోడీ ప్రభుత్వమే వాటిని ప్రోత్సహించిందని, ఇప్పుడు అసోంలో అల్లర్లను అణచివేసేందుకు గొగోయ్ సర్కారు సమర్థంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.