జగన్ మీడియా అబద్ధాల పుట్ట: అడుసుమిల్లి ఆరోపణ
ప్రజా ప్రయోజనాల పేరిట గుంటూరుకు చెందిన భూషణ్ బి భవనం దాఖలు చేసిన పిటిషన్ వ్యక్తిగత ప్రజా ప్రయోజనాలకు, ప్రచారానికి సంబంధించిన పిటిషన్ అని అడుసుమిల్లి చెప్పారు. తండ్రి అధికార దుర్వినియోగంతో అక్రమార్జనకు పాల్పడిన జగన్కు సంబంధించిన కేసును దర్యాప్తు చేస్తున్న సంస్థ, దాని అధికారుల నైతికతను దెబ్బతీయడానికి ఇలాంటి పిటిషన్ వేశారని ఆయన ఆరోపించారు. భూషణ్ పిటిషన్లోని అంశాలకు జగన్ మీడియా ఇచ్చిన ప్రాముఖ్యతను బట్టే పిటిషనర్కు, వాటికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తోందని కోర్టు దృష్టికి తెచ్చారు.
జగతి పబ్లికేషన్స్ ఆధ్వర్యంలోని పత్రిక, ఇందిరా టెలివిజన్కు చెందిన చానల్ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న తమ అధిపతికి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజలకు తప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నాయని ఆరోపించారు. కోర్టు విచారణ తీరును కూడా ప్రజలకు నిష్పక్షపాతంగా అందించడంలేదని తెలిపారు. అనైతిక వ్యవహారాల నుంచి పుట్టిన జగన్ మీడియా తనకు అనుకూలంగా లేని వ్యక్తులు, రాజకీయ పార్టీలు, సామాజిక బృందాలు, ఇతర మీడియా సమగ్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని తన పిటిషన్లో పేర్కొన్నారు.
జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించిన దర్యాప్తు అధికారులతో పాటు జర్నలిస్టులు, సాక్షులు, సామాజిక కార్యకర్తల కాల్ లిస్టులను సేకరించడం ద్వారా వారిని బెదిరించే ప్రయత్నం చేశారని, వారి హక్కులకు భంగం కలిగించారని ఆరోపించారు. కాల్ లిస్టుతో జగన్ మీడియా దుష్ప్రచారం చేసిందన్నారు. వ్యక్తుల కాల్ డేటాను అనధికారికంగా పొందడం టెలిగ్రాఫ్ చట్టం 1885లోని సెక్షన్ 5(2) కింద నేరమని తెలిపారు. అక్రమార్జనపై వెలుగుచూస్తున్న వాస్తవాలను తప్పుదోవ పట్టించడానికే ఇలాంటి పిటిషన్లు వేయిస్తున్నారని అడుసుమిల్లి ఆరోపించారు.
చివరకు జగన్ మీడియా న్యాయ వ్యవస్థపైనా దాడి చేస్తోందని ఆరోపించారు. దర్యాప్తు అధికారులు, విలేకరులు, సాక్షుల కాల్లిస్టును సేకరించి, వారి వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించిన కేసులో స్వంతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని కోర్టుకు అడుసుమిల్లి విజ్ఞప్తి చేశారు. భూషణం పిటిషన్ ప్రజా ప్రయోజనాల కిందకు రానందున దాన్ని కొట్టివేయాలని కోరారు. ఈ కేసులో తనను ప్రతివాదిగా చేరడానికి అనుమతినివ్వాలని విన్నవించారు.