బాలయ్య పోటీ చేస్తే ఎన్టీఆర్ లాగే ఉంటుంది: చమన్
శనివారంనాడు ఆయన తన సొంత జిల్లా అనంతపురం వచ్చారు. ఈ సందర్భంగా ఓ ప్రముఖ టీవీ చానెల్ ప్రతినిధితో మాట్లాడారు. గ్రూపు రాజకీయాలు అలవాటు లేదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి నిర్ణయం మేరకే తన రాజకీయ భవిష్యత్తు ఉంటుందని చమన్ చెప్పారు.
పరిటాల రవి హత్య తరువాత తొలిసారిగా చమన్ అనంతపురం వచ్చారు. పరిటాల రవి తనకు అన్నలాంటివాడని ఆయన అన్నారు. ఇటీవలి కాలంలో చమన్ రాజకీయ భవిష్యత్తుపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. అయితే, ఆయన పరిటాల రవి సతీమణి, శాసనసభ్యురాలు పరిటాల సునీతతో కలిసి చంద్రబాబు నాయుడిని కలిసిన తర్వాత ఆ చర్చకు తెర పడింది.
చమన్ తెలుగుదేశం పార్టీలోనే అనంతపురం జిల్లాలో క్రియాశీలక పాత్ర పోషించడానికి సిద్ధపడినట్లు అర్థమవుతోంది. వచ్చే ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేసే ఉద్దేశంతో కూడా ఉన్నట్లు ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. ముఠా రాజకీయాలకు తాను దూరంగా ఉంటానని ఆయన చెప్పారు.