జగన్ ఆస్తుల కేసు: కామ్గా పని చేసుకెళ్తున్న సిబిఐ
జగన్ ఆస్తుల కేసులో మొత్తం పదమూడు ఛార్జీషీట్లు దాఖలు చేస్తామని చెప్పిన సిబిఐ ఇప్పటికే మూడు ఛార్జీషీట్లు దాఖలు చేసింది. బ్రహ్మానంద రెడ్డిని రెండు నెలల క్రితం అరెస్టు చేసింది. ఎవరినైనా అరెస్టు చేసిన 90 రోజులలో ఛార్జీషీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. దీంతో మరో పది పదిహేను రోజుల్లో బ్రహ్మానంద రెడ్డి అంశంపై జగన్ కేసులో సిబిఐ కోర్టుకు ఛార్జీషీట్ దాఖలు చేసే అవకాశముంది.
ఇప్పటి వరకు దాఖలు చేసిన మూడు ఛార్జీషీట్లలోనూ సిబిఐ ఏ-1 నిందితుడిగా ఆస్తుల కేసులో అరెస్టై చంచల్గూడ జైలులో ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డిని, ఏ-2 నిందితుడిగా విజయ సాయి రెడ్డిల పేర్లను ప్రస్తావిస్తోంది. ఇక ఆయా ఛార్జీషీట్లలో ఆయా కంపెనీలు, వ్యక్తుల పేర్లను ఆ తదుపరి నిందితులుగా పేర్కొంటోంది. జెడి లక్ష్మీ నారాయణ కాల్ లిస్ట్కు ముందు మిగతా వార్తల కంటే జగన్ ఆస్తుల కేసు, సిబిఐ దర్యాఫ్తు ప్రధానంగా మీడియాలో కనిపించేది.
అయితే కాల్ లిస్ట్ బయటపడటం, దానిపై కోర్టుకు వెళ్లడం, మీడియాతో అంత సేపు మాట్లాడటంపై హైకోర్టు సిబిఐకి మొట్టికాయలు వేయడం ఇలా తదితర పరిణామాల తర్వాత సిబిఐ తన దర్యాఫ్తును కామ్గా చేసుకు వెళుతోందని అంటున్నారు. ఆ తర్వాత జగన్ కేసు హడావుడి మీడియాలో అంతగా కనిపించక పోవడమే ఇందుకు కారణమని అంటున్నారు.
బయటకు కనిపించనంత మాత్రాన జగన్ ఆస్తుల కేసు స్లోగా నడుస్తుందనుకోవద్దని, తన పని తాను సిబిఐ వేగవంతంగా పూర్తి కానిచ్చేస్తుందని అంటున్నారు. జెడి లక్ష్మీ నారాయణ ఇటీవల జిల్లాల్లో పర్యటించి తాను శోధిస్తున్న కేసులకు సంబంధించిన సమాచారం సేకరించారని తెలుస్తోంది. సిబిఐపై ఎలాంటి ఆరోపణలు రాకుండా ఉండేందుకే మీడియాకు దూరంగా ఎలాంటి హడావుడి లేకుండా పని కానిచ్చేస్తున్నారని అంటున్నారు.