రేవ్ పార్టీ పేరుతో అశ్లీల నృత్యాలు: హింద్ జాగరణ దాడి
వారిని రిసార్ట్ యాజమాన్యం తొలుత లోనికి పంపించేందుకు నిరాకరించింది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని అడ్డుకోక పోవడమే కాకుండా తమను అడ్డుకుంటున్న యాజమాన్యంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత లోనికి వెళ్లి అర్ధనగ్నంగా ఉండి, మద్యం తాగి చిందేస్తున్న యువతీ యువకులను పట్టుకొని చితక బాదారు. ఈ దాడిలో సుమారు 50 మందికి పైగా హింద్ జాగరణ వేదిక కార్యకర్తలు పాల్గొన్నారు.
అనంతరం సంఘటన స్థలానికి చేరుకున్న శంకనాడి పోలీసులు సుమారు 20 మంది యువతీ యువకులను అరెస్టు చేశారు. రేవ్ పార్టీల ముసుగులో అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నారని హింద్ జాగరణ వేదిక కార్యకర్తలు ఆరోపించారు. అయితే యువతులపై దాడి చేయడాన్ని కొందరు ఖండిస్తున్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకవేళ మహిళలు మద్యం తాగి ఉంటే వారి పెద్దలకు తెలియచేయాలే తప్ప ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరి కాదని కమిషన్ వ్యాఖ్యానించింది.
ఈ దాడిలో నలుగురు యువతులతోసహా పన్నెండు మంది గాయపడ్డారట. మరికొందరు మాత్రం హింద్ జాగరణ వేదిక కార్యకర్తల తీరును సమర్థిస్తున్నారు. రేవ్ పార్టీల పేరుతో సంస్కృతి, సంప్రదాయాలను మంటకల్పుతున్నారని, ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉన్న సమయంలోనే కొన్ని సందర్భాలలో ఇలా చేయాల్సి వస్తుందని చెబుతున్నారు.
కాగా ముఖ్యమంత్రి జగదీష్ శెట్టార్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. హోంశాఖ మంత్రి అశోక్ కూడా దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ రేవ్ పార్టీలో స్థానిక కార్పోరేటర్ ఒకరు కూడా పాల్గొన్నారని అంటున్నారు. 2009లో ఇదే తరహా దాడులు జరిగాయి. అప్పుడు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.