నిమ్మగడ్డకు కోర్టులో చుక్కెదురు: బెయిల్ నిరాకరణ
ఇరువైపులా సాగిన సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత సిబిఐ ప్రత్యేకర కోర్టు న్యాయమూర్తి దుర్గాప్రసాద రావు నిమ్మగడ్డ బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో నిమ్మగడ్డ ప్రసాద్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు ప్రభుత్వాధికారి బ్రహ్మానంద రెడ్డిని కూడా సిబిఐ అరెస్టు చేసింది.
వైయస్ జగన్ సంస్థల్లో నిమ్మగడ్డ ప్రసాద్ 842 కోట్ల రూపాయల దాకా పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలున్నాయి. అందుకు ప్రతిఫలంగా ఆయన వాన్పిక్ పేరిట ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో వేల ఎకరాలు వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో పొందినట్లు సిబిఐ ఆరోపిస్తోంది. నిమ్మగడ్డ ప్రసాద్కు అనుకూలంగా అధికారి బ్రహ్మానంద రెడ్డి వ్యవహరించారని, వీరిద్దరు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని సిబిఐ ఆరోపిస్తోంది.
మంత్రివర్గం నిర్ణయానికి విరుద్ధంగా ప్రసాద్కు మేలు చేయడానికి జీవోలు జారీ చేశారని అంటున్నారు. వాన్పిక్కు కేటాయించడానికి భూములను రిజర్వ్ చేయాలని రెండు జిల్లా కలెక్టర్లకు కూడా బ్రహ్మానంద రెడ్డే లేఖ రాశారని అంటున్నారు. బ్రహ్మానంద రెడ్డిని వైయస్ జగన్ ఆస్తుల కేసులో నిందితుడిగా చేర్చాలని సిబిఐ కోర్టులో మెమో దాఖలు చేసింది.