సిబిఐ జెడి లక్ష్మినారాయణపై పిటిషన్ కొట్టివేత
ఆ పిల్పై విచారణ చేపట్టిన హైకోర్టు పిటిషన్ విచారణఆర్హం కాదని తేల్చి చెప్పింది. ఇది ప్రజా ప్రయోజనాల కిందికి రాదని స్పష్టం చేసింది. దీనికి తోడు కోర్టును తప్పుదోవ పట్టించినందుకు గాను పిటిషనర్కు 25 వేల రూపాయల జరిమానాను విధించింది. ప్రస్తుతం ఈ వ్యవహారంలో మరో దర్యాప్తు సంస్థ విచారణ చేస్తున్నందున పిటిషన్ను కొట్టేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ జాయింట్ డైరెక్టర్ (జేడీ) లక్ష్మినారాయణపై ఈ నెలారంభంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియాతో అన్నిసార్లు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని, దర్యాఫ్తు సంస్థతో మీడియాకు ఏం సంబంధమని హైకోర్టు ప్రశ్నించింది. మీడియాతో మాట్లాడటంపై వివరణ ఇవ్వాలని కూడా కోర్టు సిబిఐని ఆదేశించింది. ఈ అంశంపై సిబిఐ ఖచ్చితమైన వివరణ ఇవ్వాలని సూచించింది.
మీడియాతో జెడి ఫోన్లపై భవనం భూషణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్ స్వీకరించిన కోర్టు సిబిఐ జెడికి నోటీసులు జారీ చేసింది. కాగా మీడియాతో మాట్లాడలేదని కోర్టును తప్పుదోవ పట్టించిన సిబిఐ జెడి లక్ష్మీ నారాయణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గుంటూరు జిల్లాకు చెందిన భూషణ్ బి.భవనం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసిన విషయం తెలిసిందే. సిబిఐ జెడి ఫోన్ నుంచి వెళ్లిన, ఆయన ఫోన్కు వచ్చిన కాల్స్, ఎస్సెమ్మెస్ల వివరాలను సమర్పించేలా బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ను ఆదేశించాలంటూ ఆయన హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.