యాదగిరికి నేనే డబ్బులిచ్చా: ఎమ్మెల్యే సురేష్ బాబు
గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కుంభకోణం కేసుతో తనకు ఏ విధమైన సంబంధం లేదని సురేష్ బాబు అన్నారు. తనకు నోటీసులు జారీ చేయడం వల్లనే ఎసిబికి తాను లొంగిపోయినట్లు ఆయన మీడియాకు తెలిపారు. సురేష్ బాబు సోమవారం సాయంత్రం ఎసిబి కార్యాలయానికి వచ్చి లొంగిపోయారు. ఎసిబి నోటీసులు జారీ చేయడంతో ఆయన లొంగిపోయారు. రౌడీ షీటర్ యాదగిరికి తాను ఓ హోటల్లో 4.5 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు సురేష్ బాబు నేరాంగీకార పత్రంలో అంగీకరించారు. గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ డీల్ 20 కోట్ల రూపాయలని, ఇందులో 9.5 కోట్లు చెల్లించామని ఆయన చెప్పారు. మొత్తం 20 కోట్లలో పట్టాభి రామారావుకు, చలపతిరావుకు, యాదగిరికి ఐదేసి కోట్ల రూపాయలు మట్టాల్సి ఉందని, మరో ఐదు కోట్లు కోర్టు ఖర్చుల కింద వెళ్లాయని ఆయన చెప్పారు.
తనకు గాలి సోదరులు చాలా ఏళ్లుగా సన్నిహితులని, గాలి జనార్దన్ రెడ్డి బంధువు దశరథరామి రెడ్డితో కూడా తనకు పరిచయం ఉందని ఆయన అన్నారు. గాలి జనార్దన్ రెడ్డిని తాను జైలులో చాలాసార్లు కలిసినట్లు ఆయన తెలిపారు. గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ ఇప్పించే వ్యవహారంలోనే తనను ఆంధ్రప్రదేశ్ పంపించారని ఆయన చెప్పారు. గాలి జనార్దన్ రెడ్డికి ఒఎంసి కేసులో బెయిల్ మంజూరైన రోజు రాత్రి పది గంటలకు యాదగిరికి డబ్బులు ఇచ్చానని ఆయన చెప్పారు.
గాలి బెయిల్ కుంభకోణం కేసులో కర్ణాటకకు చెందిన శాసనసభ్యులు గాలి సోమశేఖర రెడ్డికి, సురేష్ బాబుకు ఎసిబి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దాంతో సురేష్ బాబు ఎసిబి కార్యాలయానికి వచ్చారు. సోమశేఖర రెడ్డి, సురేష్బాబు విదేశాలకు పారిపోకుండా ఎసిబి ఇది వరకే అంతర్జాతీయ విమానాశ్రయాలకు లుకవుట్ నోటీసులు జారీ చేసింది. గాలి జనార్దన్ రెడ్డి బంధువు, వ్యాపారి దశరథరామిరెడ్డిని ఎసిబి ఇటీవల అరెస్టు చేసింది.
ఈ కేసులో ఇప్పటికే ఎసిబి పలువురిని అరెస్టు చేసింది. దశరథరామిరెడ్డిని ఎసిబి అధికారులు ఆదివారం కోర్టులో హాజరుపర్చింది. దీంతో అతనికి వచ్చే నెల 3వ తేది వరకు రిమాండ్ విధించారు. అతనిని చర్లపల్లి జైలుకు తరలించారు. గాలికి బెయిల్ ఇప్పించేందుకు ఇరవై కోట్లు మాత్రమే కాదని రూ.100 కోట్లు ఇచ్చేందుకు కూడా సిద్ధపడినట్లుగా ఇటీవల అరెస్టయిన జిల్లా జడ్జి తన వాంగ్మూలంలో చెప్పారు.
చంచల్గూడ జైలులో ఉన్నప్పుడు ములాఖత్లో భాగంగా తనను కలిసేందుకు వచ్చిన అనుచరులకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇప్పించాలని, ఇంత ఖర్చయినా ఫర్వాలేదని గాలి చెప్పేవాడని తెలుస్తోంది. దాంతో ఈ బాధ్యత ఆయన సోదరుడు సోమశేఖర రెడ్డి, కర్నాటకలోని కంప్లి శాసనసభ్యుడు సురేష్లు తమ భుజానికి ఎత్తుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి వరకూ వెల్లడయిన అంశాల ప్రకారం బెయిల్ కోసం వీరు వేర్వేరు వ్యక్తుల ద్వారా మూడుసార్లు ప్రయత్నాలు చేశారు.