రేవ్ పార్టీలో అమ్మాయిలపై దాడి: అట్టుడికిన అసెంబ్లీ
రాష్ట్రంలో శాంతిభద్రతల వ్యవస్థ కుప్ప కూలిందనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలని ప్రశ్నించారు. బిజెపిఅధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయనీ, ఇందుకు ప్రభుత్వం పరోక్షంగా ఇస్తున్న మద్దతే కారణమని ఆరోపించారు. మంగళూరు హోం స్టేపై దాడికి నేతృత్వం వహించిన సుభాష్ పడిల్ గతంలో జరిగిన పబ్ దాడుల్లో కూడా నిందితుడని తెలిపారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షిస్తామని చెప్పే బిజెపి ప్రభుత్వం రేవ్ పార్టీలకు అనుమతినివ్వడాన్ని ఆయన విమర్శించారు. యువతీ యువకులు అర్ధనగ్నంగా గంతులువేస్తూ గంజాయి తాగే సంస్కృతికి బిజెపి లైసెన్సులు ఇస్తోందని దుయ్యబట్టారు. ఇదేనా భారతీయ సంస్కృతి పరిరక్షణ చేసే విధానమని ప్రశ్నించారు. మంగళూరు సంఘటనపై సమగ్ర చర్చకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ను కోరారు.
ఈ అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ పేర్కొనడంతో ప్రశ్నోత్తరాల తదుపరి చర్చకు అనుమతిస్తామని స్పీకర్ చెప్పారు. రిసార్టులో దాడి ఉదంతం విధాన పరిషత్ను కూడా కుదిపివేసింది. సభలో ప్రతిపక్ష నేత ఎస్సార్ పాటిల్తో పాటు కాంగ్రెస్ సభ్యులు మంగళూరులో జరిగిన ఘటనపై చర్చ కు అవకాశం ఇవ్వాలని పట్టుబట్టారు. ప్రశ్నోత్తరాల అనంతరం అవకాశం ఇస్తానని సభాపతి శంకరమూర్తి చెబుతున్నా వినిపించుకోకుండా పోడియంలోకి దూసువెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలుచేశారు.
దీంతో సభాపతి సభను 10నిముషాలపాటు వాయి దా వేశారు.ఈ సందర్భంగాఎస్.ఆర్.పాటిల్ మాట్లాడుతూ, యువతులపై జరిగిన దాడులు సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకోవాల్సిన విషయమన్నారు. ప్రశ్నోత్తరాల అవధిని పక్కకు పెట్టి ఈ అంశంపై చర్చకు అవకాశం ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ సభ్యుల డిమాండ్కు జెడిఎస్ సభ్యుడు నాణయ్య మద్దతు ఇచ్చారు. సభానేత మంత్రి సోమణ్ణ మాట్లాడుతూ, యువతులపై దాడికి ప్రభుత్వం కూడా సిగ్గుతో తలదించుకుంటోందన్నారు.
ప్రశ్నోత్తరాల తర్వాత దీనిపై వివరంగా చర్చిద్దామన్నారు. అధికార పార్టీ సభ్యురాలు లీల కూడా ఇదే మాట అనడంతో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. అటు పోడియంలో ధర్నాను కాంగ్రెస్ సభ్యులు ఎంతసేపటికీ విరమించకపోవడంతో సభాపతి సభను కొద్దిసేపు వాయిదా వేశారు. ఇదొక మనసును కలచివేసే సంఘటన అని ఆయన వ్యాఖ్యానించారు. చర్చకు తర్వాత తప్పక అనుమతి ఇస్తామని పదే పదే చెప్పినప్పటికీ సభ్యులు వినకపోవడంతో సభను వాయిదా వేశారు.
కాగా మంగళూరు దాడి కేసులో ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అమ్మాయిలపై దాడిని ఖండిస్తూ కళాశాల విద్యార్థులు జూలై 30వ తేదిన బంద్ పాటించారు. ఈ బందును మిస్ యూజ్ చేసుకోకూడదని యూత్ కాంగ్రెసుకు విద్యార్థి సంఘాలు సూచించాయి. బంద్ నేపథ్యంలో మంగళూరు నగరంలో కర్ఫ్యూ విధించారు.