లైంగిక దాడి: భారత అధికారి మహాపాత్ర విడుదల
మహాపాత్ర శుక్రవారం విడుదలైనట్లు సమాచారం. సోమవారంనాడు ఆయన న్యూయార్క్ లోని భారత కాన్సులేట్ అధికారులను కలిశారు. పెన్సిల్వేనియాలోని మాటమోరస్ నగరంలో పోలీసులు అరెస్టు చేసినప్పటి నుంచి కాన్సులేట్ అధికారులు మహాపాత్రతో టచ్ లో ఉన్నారు. తాను ఏ విధమైన తప్పు చేయలేదని మహాపాత్ర అంటున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతోందని అమెరికాలోని భారత దౌత్యవేత్త నిరుపమా రావు అన్నారు. అంతకు మించి మాట్లాడడానికి ఆమె నిరాకరించారు.
మహాపాత్రకు న్యాయ సహాయం అందించడానికి కాన్సులేట్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కోర్టులో కేసు విచారణ సమయంలో మహాపాత్ర ఉండడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మహాపాత్రకు దౌత్యపరమైన పాస్పోర్టు లేదు. అధికారిక పాస్ పోర్టు మాత్రమే ఉంది. మహాపాత్రకు 35 వేల డాలర్ల బెయిల్ సొమ్ము కూడా పంపించారు.
న్యూయార్క్లో సైరకుస్ విశ్వవిద్యాలయంలోని వర్క్షాప్లో పాల్గొనడానికి వెళ్లిన 34 మంది అధికారుల్లో ఆయన ఒకరు. పోలీసులు సురేంద్ర మహాపాత్ర పాస్పోర్టును స్వాధీనం చేసుకున్నారు. మిగతా అధికారుల బృందం తమ అధ్యయన పర్యటనలో భాగంగా వాషింగ్టన్ డిసికి బయలుదేరి వెళ్లింది. మహాపాత్రకు సహాయం చేయడానికి కోర్సు సమన్వయకర్త ధర్మేంద్ర భార్గవ మాత్రం ఇక్కడే ఉండిపోయారు. మహాపాత్ర ఉంటున్న అంతస్థులోనే భార్గవ కూడా దిగారు.
ఇంటర్నెట్ సమస్య ఉందని అధికారులు చెబుతున్నారని మహాపాత్ర తనతో రాత్రి తొమ్మిదిన్నర, పది గంటల మధ్య అన్నాడని ధర్మేంద్ర చెబుతున్నారు. హోటల్ సిబ్బందికి చెప్పడంతో ఓ మహిళను పంపించారని, ఆమె కూడా కనెక్షన్ను పునరుద్ధరించలేకపోయిందని, ఆమె కేవలం ఐదు నుంచి ఏడు నిమిషాలపాటు మాత్రమే తన గదిలో ఉందని మహాపాత్ర అన్నట్లు ఆయన తెలిపారు.
మహాపాత్ర వృద్ధుడు, జెంటిల్మన్ అని, మహిళ వెళ్లిపోయిన తర్వాత తన ల్యాప్ట్యాప్పై పనిచేస్తూ భార్గవ కనిపంచారని ఆయన చెప్పారు. రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు అంతా బాగానే ఉందని ఆయన చెప్పారు. ఆ తర్వాత ఆమె ఫిర్యాదు చేసిందని అంటున్నారు. ఎవరూ మద్యం కూడా సేవించలేదని ఆయన చెప్పారు.