ప్రభుత్వానికి సుప్రీంలో షాక్, ఏకీకృత ఫీజుకు ఆదేశాలు
ఫీజుల నిర్ణయం విషయంలో గతంలో ఇచ్చిన తీర్పునే అమలు చేయాలని ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ విద్యాసంవత్సరం 2012 - 2013 నుంచే ఏకీకృత పన్ను విధానాన్ని అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తాము ఇంతకు ముందటి రెండు విద్యాసంవత్సరాలకు మాత్రమే స్టే ఇచ్చినట్లు స్పష్టం చేసింది. మెరిట్ ప్రాతిపదికన కన్వీనర్ కోటా కింద భర్తీ చేసే ఎ కెటగీరీ సీట్లకు, యాజమాన్య కోటా కింద భర్తీ చేసే బి కెటగిరీ సీట్లకు ఒకే రకమైన ఫీజులు ఇక నుంచి అమలు కానుంది.
ఫీజులను పెంచాలని కోరుతూ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు సుప్రీంకోర్టును అశ్రయించాయి. ఫీజు పెంపుపైనే దృష్టి పెట్టాలని కాలేజీ యాజమాన్యాలు కోరుతున్నాయి. ఫీజు పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తోందని యాజమాన్యాలు విమర్శిస్తున్నాయి. ఫీజు పెంపునకు అనుమతించాలని కోరుతున్నాయి. ఏకీకృత ఫీజును అమలు చేయాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఏ చట్టం కింద ప్రభుత్వం ఫీజు రీయంబర్స్మెంట్ ఇస్తోందని ప్రశ్నించింది. విద్యార్థులు తక్కువ కాలేజీలు ఎక్కువ కావడంతో కూడా సమస్య తలెత్తుతోందని వ్యాఖ్యానించింది.
కన్వీనర్ కోటా కింద ఇప్పటి వరకు 35 వేల రూపాయల ఫీజు ఉంది. ఇప్పుడు ఆ ఫీజు 50200కు పెరుగుతుంది. ప్రభుత్వం కన్వీనర్ కోటా కింద సీట్లు పొందిన పేద విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ ఇస్తోంది. ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం 35 వేల రూపాయలు ఇప్పటి వరకు చెల్లిస్తోంది. ఫీజు పెంపుతో ప్రభుత్వం అదనంగా ఒక్కో విద్యార్థికి 15 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ప్రభుత్వంపై పెను భారం పడే అవకాశం ఉంది. ఇంజనీరింగ్ కాలేజీల్లోని 70 శాతం సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తున్నారు. మిగతా 30 శాతం సీట్లను యాజమాన్యం కోటా కింద భర్తీ చేస్తున్నారు. మేనేజ్మెంట్ కోటా కింద ఫీజు 95 వేల రూపాయలు ఉంది.