గాలి బెయిల్ డీల్: శ్రీరాములు ఇరుక్కుంటారా?
శ్రీరాములు సూచన మేరకే తాను, బళ్లారి అర్బన్ శాసనసభ్యుడు గాలి సోమశేఖర రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి బంధువు దశరథరామి రెడ్డి బెయిల్ కోసం యాదగిరి ద్వారా న్యాయమూర్తులకు లంచం ఇవ్వజూపామని సురేష్ బాబు ఎసిబి అధికారులకు చెప్పినట్లు సమాచారం.
శ్రీరాములు సూచన మేరకు తాను ఆంధ్రప్రదేశ్కు వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారి రావి సుర్యప్రకాశ్ బాబును కలిశానని సురేష్ బాబు చెప్పారు. గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన సస్పెండైన న్యాయమూర్తి పట్టాభి రామారావుకు సస్పెండైన న్యాయమూర్తులు లక్ష్మీనరసింహా రావు, డి. ప్రభాకర రావు, రావి సూర్యప్రకాశ్ బాబు సన్నిత మిత్రులని, వారిని తాను కలిశానని ఆయన చెప్పారు. రిటైర్డ్ జడ్డి చలపతిరావు ద్వారా బెయిల్ వచ్చేలా చూసే విషయంపై తాను రౌడీ షీటర్ యాదగిరితో బంజారాహిల్స్లోని దస్పల్లా హోటల్లో చర్చించినట్లు ఆయన తెలిపారు.
గాలి జనార్దన్ రెడ్డికి మే 11వ తేదీన బెయిల్ వచ్చిన తర్వాత గాలి సోమశేఖర రెడ్డి యాదగిరికి దస్పల్లా హోటల్లో తొమ్మిది సంచుల్లో పెట్టి 4.5 కోట్ల రూపాయలు ఇచ్చారని ఆయన చెప్పారు. అక్కడి నుంచి ఫోర్ వీలర్లో యాదగిరితో పాటు తాను అశోక్నగర్ వెళ్లి చలపతిరావుకు డబ్బులు ముట్టజెప్పామని ఆయన చెప్పారు. సురేష్బాబును ఎసిబి అరెస్టు చేసి, కోర్టులో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు.