గాలి బ్రదర్స్ రాజకీయ శకం ముగుస్తోందా?
గాలి జనార్దన్ రెడ్డికి అత్యంత అనుంగు అనుచరుడైన స్వతంత్ర శాసనసభ్యుడు శ్రీరాములు కూడా గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కుంభకోణం కేసులో ఇరుక్కునే అవకాశాలున్నాయి. బళ్లారి రాజకీయాలను తమ ధన, భుజ బలాలతో శాసించిన రెడ్డి బ్రదర్స్, ఆయన అనుచరులు ఇప్పుడు పూర్తిగా న్యాయ పోరాటాలు మునిగిపోవాల్సిన పరిస్థితిలో పడ్డారు. దీంతో వారి రాజకీయాలు వెనక్కి తగ్గే వాతావరణం ఏర్పడింది. అయితే గత రెండు దశాబ్దాలుగా కూడబెట్టుకున్న సంపదంతా వారి చేజారి పోకపోవచ్చు గానీ రాజకీయాధిపత్యానికి మాత్రం దెబ్బ పడుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
కంప్లీ శాసనసభ్యుడు సురేష్ బాబు అరెస్టుతో ఎక్కువ నష్టపోయేది శ్రీరాములే. గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కుంభకోణం కేసులో శ్రీరాములు పాత్ర ఉందనే విషయాన్ని సురేష్ బాబు నేరాంగీకార పత్రం వెల్లడించింది. రాష్ట్ర రాజకీయాలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్న శ్రీరాములు కూడా కేసులో ఇరుక్కుంటే గాలి బ్రదర్స్ రాజకీయాలకు ఊహించని దెబ్బ తగులుతుంది.
గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ ఇప్పించడానికి ఎవరెవరిని కలువాలో, ఎవరెవరు సాయం చేస్తారో శ్రీరాములు తనకు చెప్పిన విషయాలను సురేష్ బాబు ఎసిబి అధికారులు చెప్పారు. శ్రీరాములుకు, బెయిల్ ఇప్పించడానికి సహాయం చేసినవారికి మధ్య సంబంధాలున్నట్లు కూడా సురేష్ బాబు వాంగ్మూలాన్ని బట్టి తెలుస్తోంది.
తాను జైలులో ఉంటూనే శ్రీరాములు ద్వారా కర్ణాటక రాజకీయాలను నడిపించాలని గాలి జనార్దన్ రెడ్డి వ్యూహం రచించారు. ఇందులో భాగంగానే శ్రీరాములుతో పార్టీ కూడా పెట్టించారు. అయితే, తాజా పరిణామాలతో ఆ ప్రయత్నాలకు ఆదిలో గండి పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కుంభకోణం కేసులో ఒక్కరొక్కరే అరెస్టవుతున్నారు. కర్ణాటకలోని బళ్లారిలో కాంగ్రెసు ఆధిపత్యానికి గండి కొట్టి బిజెపి అధికారంలోకి రావడానికి ప్రధాన పాత్ర పోషించింది గాలి సోదరులే. దాంతోనే వారు కర్ణాటక బిజెపి రాజకీయాలను కూడా తమకు అనుకూలంగా తిప్పుకునే ప్రయత్నం చేశారు. మొత్తం మీద, బళ్లారి రెడ్డి బ్రదర్స్కు ఇప్పుడు పూర్తిగా గడ్డుకాలమే.