దేవుడి దయవల్ల వచ్చా, అరెస్టు డ్రామా: కోనేరు ప్రసాద్
దాదాపు 9 నెలల పాటు ఆయన జైలులో ఉన్నారు. ఆరు సార్లు బెయిల్ కోసం ఆయన పిటిషన్లు దాఖలు చేసుకున్నారు. అయితే వాటిని న్యాయస్థానాలు తిరస్కరించాయి. చివరకు హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దేవుడి దయ వల్ల తాను బయటకు వచ్చానని కోనేరు ప్రసాద్ జైలు నుంచి విడుదలైన అనంతరం మీడియా ప్రతినిధులతో అన్నారు. తన అరెస్టు ఓ డ్రామా అని ఆయన వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఎపిఐఐసి)కి తెలియకుండా ఎమ్మార్ ప్రాపర్టీస్, స్టైలిష్ హోమ్స్ ఒప్పందం చేసుకుని విల్లాలను అధిక ధరలకు విక్రయించినట్లు ఆరోపణలున్నాయి. గజానికి 25 నుంచి 50 వేల రూపాయల ధరలకు కోనేరు ప్రసాద్ విల్లాలను విక్రయించి రికార్డుల్లో ఐదు వేల రూపాయల ధరనే రికార్డు చేసినట్లు తెలుస్తోంది. విల్లాల విక్రయంపై కోనేరు ప్రసాద్ నివాసంలో ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. స్టైలిష్ హోమ్స్ తప్పుడు లెక్కల వల్ల ఎపిఐఐసికి భారీగా నష్టం వాటిల్లింది.
ఎమ్మార్ కేసులో నిందితుడు విజయరాఘవకు సిబిఐ కోర్టులో చుక్కెదురైంది. బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. మరోవైపు ఇదే కేసులో నిందితుడుగా ఉన్న బీపీ ఆచార్యకు బెయిల్ ఇవ్వద్దంటూ కోర్టులో సీబీఐ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ 7వ తేదీకి వాయిదా పడింది.