టెక్కీ నీలిమ మృతిపై వీడని మిస్టరీ: అనుమానాస్పదమే
నీలిమ మృతి చెందిన రోజు రాత్రి 8.39 నిమిషాలకు ఆఫీసులోనికి వెళ్లిందని, ఆ తర్వాత 9.36 నిమిషాలకు బయటకు వచ్చిందని చెప్పారు. అక్కడి నుండి మల్టీ లెవల్ కార్ పార్కింగ్ బిల్డింగ్కు వెళ్లిందని చెప్పారు. రాత్రి 9.36 నిమిషాల వరకు నీలిమ కదలికలు సిసి కెమెరాలో లభ్యమయ్యాయని చెప్పారు. 10.30 గంటలకు ఓ శబ్దం రావడంతో వాచ్ మెన్ రమేష్ నీలిమ లాన్ లో పడి ఉండటాన్ని చూశాడని, ఈ విషయం తెలుసుకున్న కంపెనీ ఉద్యోగులు ముగ్గురు ఆమెను ఆసుపత్రికి తరలించారని చెప్పారు.
వైద్యులు ఆమె మృతి చెందినట్లుగా చెప్పారని, తమకు రాత్రి 11 గంటల ప్రాంతంలో ఫోన్ కాల్ వచ్చిందని, ఆమెకు చెందిన ఓ చెప్పు ఏడో అంతస్తులో దొరికిందని, మరో చెప్పు ఆమె శరీరంతోనే ఉందని, హ్యాండ్ బ్యాగ్ పదో అంతస్తులో ఉందని చెప్పారు. ఆమె ఏడో అంతస్తు నుండి పడిపోయినట్లుగా ప్రాథమికంగా అంచనాకు వచ్చామని, అక్కడ పైపులకు రక్తం మరకలు ఉన్నాయని చెప్పారు. నీలిమ లాన్ లో పడిపోవడం వల్లనే పెద్దగా గాయాలు కాలేదన్నారు.
తాము ప్రస్తుతానికి ఏ నిర్ధారణకు రాలేదని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నామని చెప్పారు. ఆమె హ్యాండ్ బ్యాగులో చిన్న స్లిప్ దొరికిందని, అందులో ఓ అడ్రస్ ఉందని చెప్పారు. ఈ కేసులో ఆమె భర్త, తల్లితో పాటు అందరినీ విచారిస్తామని చెప్పారు. నీలిమ ఫోన్ లాక్ అయిందని అందుకే పూర్తిగా వివరాలు త్వరగా సేకరించలేక పోయామని చెప్పారు. ఆమె చేసిన ఎస్సెమ్మెస్లు ఓపెన్ కావడం లేదని చెప్పారు. కాల్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
తాము ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయని, అది తప్పన్నారు. ఇప్పటి వరకు తాము ఎవరినీ అరెస్టు చేయలేదన్నారు. నీలిమ ఫోన్ లోని నంబర్లను ట్రేస్ చేసే పనిలో ఉన్నామని చెప్పారు. నీలిమ పోస్టుమార్టం నివేదిక నాలుగైదు రోజుల్లో వస్తుందని, అప్పుడు పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. సెల్ ఫోన్ ఆధారంగా విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. నీలిమ చనిపోయే ముందు పలు పోన్స్ మాట్లాడిందని, ఆఖరి కాల్ విషయమై ఆరా తీస్తున్నట్లు చెప్పారు.
ఇన్ఫోసిస్ కంపెనీలో 14 సిసి కెమెరాలు ఉన్నాయని, ఉద్యోగులు విచారణకు సహకరిస్తున్నారని, ఈ కేసులో ఎవరైనా దోషిగా తేలితే తప్పని సరిగా పట్టుకుంటామని, కేసుని నిష్పక్షపాతంగా దర్యాఫ్తు చేస్తున్నామని చెప్పారు.