చిరంజీవి కన్నా తొందరగానే జగన్: ఎర్రంనాయుడు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఒప్పందం చేసుకున్నారని తెలుగుదేశం పార్టీ నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు హైదరాబాదులో మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. వైయస్ జగన్కు బెయిల్ కోసమే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాష్ట్రపతి ఎన్నికల్లో యుపిఎ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేసిందని ఆయన అన్నారు. ఢిల్లీలో ఒప్పందం జరిగిన తర్వాత సిబిఐ దర్యాప్తులో వేగం తగ్గిందని ఆయన అన్నారు.
కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డాయని, తమ పార్టీని అంతం చేయడానికి ఆ పార్టీలు మూడు కలిసి పనిచేస్తున్నాయని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసుతో తెరాసకు కూడా అవగాహన ఉందని ఆయన అన్నారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ఒకే చెట్టు కొమ్మలని ఆయన వ్యాఖ్యానించారు.
ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికే వైయస్ జగన్ పార్టీని స్థాపించారని ఆయన అన్నారు. సోనియా గాంధీ కూడా జైలుకు వెళ్లే రోజు వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. తెరాస, కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు ఒకే ఎజెండాతో పనిచేస్తున్నాయని ఆయన అన్నారు.