టెక్కీ నీలిమ మృతి: ఆఖరిమెయిల్ భర్తకు, ఫోన్ ఫ్రెండ్కు
నీలిమ అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తులో భాగంగా రాయదుర్గం పోలీసులు ఆమె ఈ-మెయిల్ను బ్రేక్ చేశారు. శనివారం ఓ ప్రత్యేక సాఫ్ట్వేర్ సాయంతో దాన్ని ఓపెన్ చేసి.. అందులోని వివరాలు తెలుసుకున్నారు. నీలిమ తన ఆఖరి ఈ-మెయిల్లను భర్తతోపాటు విశాఖపట్నానికి చెందిన స్నేహితుడు ప్రశాంత్ అలియాస్ పండుకు పంపినట్లు.. చివరి ఫోన్కాల్ ప్రశాంత్కే చేసినట్లు నిర్ధారించారని తెలుస్తోంది.
నీలిమది ఆత్మహత్య అవడానికే ఆస్కారం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ప్రాజెక్ట్ వర్క్లో భాగంగా చాలా నెలలపాటు నీలిమ అమెరికాలోనే ఉన్నారు. ఇటీవలే నగరానికి వచ్చారు. కాగా, మంగళవారం గచ్చిబౌలి కార్యాలయానికి రమ్మని తామెవరూ నీలిమకు వర్తమానం పంపలేదని ఇన్ఫోసిస్ సంస్థ పోలీసులకు స్పష్టం చేసింది. నీలిమే స్వచ్ఛందంగా వచ్చారని, ఆమె వద్ద యాక్సెస్ కార్డు ఉండటంతో తేలిగ్గా లోపలికి రాగలిగారని పేర్కొంది. నీలిమ ఆఫీసుకు వచ్చినా.. పాత మిత్రుల్లో ఎవరినీ కలవలేదని తెలిసింది.
కార్యాలయం భవనంలోకి రాత్రి 9.00 గంటలకు ప్రవేశించిన నీలిమ.. 9.36 గంటల వరకూ అందులోని వివిధ అంతస్తుల్లో తిరిగి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. పార్కింగ్ భవనంలో నీలిమ 53 నిమిషాల సేపు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. తన సెల్ఫోన్ నుంచే మెయిల్ యాక్సెస్ చేసిన నీలిమ.. భర్తకు, ప్రశాంత్కు అక్కడి నుంచే ఈ మెయిల్స్ టైప్ చేసి పంపారని చెబుతున్నారు. తెలుగు పదాలను స్పష్టంగా, అర్థమయ్యే రీతిలో ఆంగ్లంలో కంపోజ్ చేశారని.. అందుకే అక్కడ అంత ఎక్కువ సమయం పట్టిందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
భర్తకు పంపిన ఈ మెయిల్లో పైన చెప్పిన వివరాలతో పాటు తన బంగారాన్ని కుటుంబ సభ్యుల్లో ఎవరెవరికి ఎంత ఇవ్వాలి? తాను ఎవరికి ఎంత డబ్బు చెల్లించాలి? తదితర అంశాలతో పాటు ఇంటి పరిస్థితి, తనకున్న చిట్స్ వివరాలను పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రశాంత్కు పంపిన మెయిల్లో మాత్రం.. ‘నీకు ఈ జన్మలో సేవ చేయలేకపోతున్నాను' అన్నట్లు రాసి ఉందని చెబుతున్నారు. ఇన్ఫోసిస్లోని ఘటనాస్థలిని మరోసారి పరిశీలించిన దర్యాప్తు అధికారులు అత్యంత కీలకమైన క్రైమ్ సీన్ రీ-కన్స్ట్రక్షన్(నేర స్థలి పునర్ నిర్మాణం) పూర్తి చేశారు. ఇందులో తమకు సందేహించదగ్గ ఎలాంటి సందర్భాలూ ఎదురుకాలేదని వారు పేర్కొంటున్నారు.
నీలిమ తన సెల్ నుంచి చివరగా ప్రశాంత్కు ఫోన్ చేసి.. 2 నుంచి 3 నిమిషాలపాటు మాట్లాడినట్లు తేలింది. నీలిమ ఫేస్బుక్లోని వివరాల ఆధారంగా ఆమె నగరంలోని షాదన్ ఉమెన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ(2006)తో పాటు విశాఖపట్నంలోని నలంద జూనియర్ కాలేజీ (2002)లోనూ విద్యనభ్యసించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ప్రశాంత్ ఆమెకు బాల్య స్నేహితుడని భావిస్తున్నారు. అతడు అందుబాటులో లేకపోవడంతో పూర్తి వివరాలు తెలియలేదని, త్వరలోనే అతడి నుంచీ వాంగ్మూలం నమోదు చేస్తామని రాయదుర్గం ఇన్స్పెక్టర్ బాలకోటి తెలిపారు.
నీలిమ భర్త సురేష్, మామ, మరో ఇద్దరు యువకులు శనివారం ఉదయం సైబరాబాద్ కమిషనర్ ద్వారకా తిరుమలరావును కలిశారు. కమిషనర్ సూచన మేరకు వారంతా మాదాపూర్ డీసీపీ యోగానంద్తో మాట్లాడారు. ఆదివారం నీలిమ కుటుంబీకుల నుంచి వాంగ్మూలం నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. వీరందరి నుంచి వివరాలు సేకరించిన తరవాత నీలిమ అనుమానాస్పద మృతిపై అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేయాలని సైబరాబాద్ పోలీసులు నిర్ణయించారు.