పంతం నెగ్గించుకున్న భార్యలు: ఐజిపైకి చెప్పు, ఉద్రిక్తం
దీంతో హోంమంత్రి సబితా రెడ్డి వెంటనే స్పందించారు. ఆందోళన చేస్తున్న వారితో వెంటనే చర్చలు జరిపి వారి సమస్యలు పరిష్కరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. కానిస్టేబుళ్ల కుటుంబాల ఆందోళనలను తాము గుర్తించామని, సమస్యలను పరిష్కరిస్తామని సబిత చెప్పారు. సోమవారం బెటాలియన్ డిజి అధికారులతో సమావేశమవుతామని సబిత హామీ ఇచ్చారు.
సబిత ఆదేశాల నేపథ్యంలో ఉన్నతాధికారులు పోలీసు కుటుంబాలతో చర్చలు జరిపారు. అడిషనల్ డిజి గౌతమ్ వారితో చర్చలు జరిపారు. ప్రస్తుతమున్న ఎబిసి గ్రూపు సెలవులు రద్దు చేస్తామని, వేధింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై వారంలోగా చర్యలు తీసుకుంటామని, సెలవుల విధానంలో కొత్త మార్పులు తీసుకు వస్తామని, లంచాలు తీసుకొని సెలవులు ఇచ్చే అధికారులపై చర్యలు తీసుకుంటామని ఐజి గౌతమ్ పోలీసు కుటుంబాలకు హామీ ఇచ్చారు. దీంతో మహిళలు ధర్నాను మానుకునేందుకు సిద్ధపడ్డారు.
అయితే అదే సమయంలో కానిస్టేబుల్ కుటుంబాల నుండి వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐజి వెంకటేశ్వర రావు అక్కడ కనిపించడంతో ఓ మహిళ చెప్పు విసిరారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. వెంకటేశ్వర రావు డౌన్ డౌన్ అంటూ మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అతనిని వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు కల్పించుకొని పరిస్థితి సద్దుమణిగేలా చేశారు.
పోలీసు అధికారులపై తాము దాడి చేసినట్లుగా వార్తలు వస్తున్నాయని, అది తప్పని మేం అధికారులను కేవలం మూకుమ్మడిగా ముట్టడించడం మాత్రమే చేశామని పోలీసుల కుటుంబాలు చెబుతున్నాయి. మరోవైపు విజయనగరం జిల్లా 5వ బెటాలియన్ కార్యాలయం వద్ద పోలీసుల భార్యలు ఆందోళనకు దిగారు. వారితో ఐజి రావు చర్చలు జరిపారు. అయితే రూరల్ అధికారు తమకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అదిలాబాద్ జిల్లాలోని 13వ బెటాలియన్ వద్ద పోలీసు కుటుంబాలు ఆందోళనను కొనసాగిస్తున్నాయి.
మరోవైపు కడపలోని 11వ బెటాలియన్ కార్యాలయం ఎదుట, యూసఫ్ గూడలోని 1వ బెటాలియన్ ఎదుట, నల్గొండలోని అన్నెపర్తి బెటాలియన్ ఎదుట పోలీసుల కుటుంబాలు ఆందోళనకు దిగాయి.