మాజీ ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్య: మంత్రి రాజీనామా
లేఖ ఆధారంగా ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా గోపాల్ పైన ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆయన తన పదవికి ఆదివారం రాత్రి రాజీనామా చేశారు. ఎండిఎల్ఆర్ అనే విమానయాన సంస్థను నడిపిన గోపాల్ కందా 2009 శాసనసభ ఎన్నికల్లో సిర్సా నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. హుడా ప్రభుత్వంలో హోం, పురాపాలక, పరిశ్రమలు, వాణిజ్య వ్వవహారాల సహాయమంత్రిగా పని చేస్తున్నారు.
ఎండిఎల్ఆర్ విమానయాన సంస్థ మూతపడిన తర్వాత అందులో ఎయిర్ హోస్టెస్గా పని చేసే గీతికకు గోపాల్ మరో అనుబంధ సంస్థలో అవకాశం ఇచ్చారు. ఇటీవలె ఆమె ఎంబిఏ చదివేందుకు ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. గీతిక సోదరుడు విలేకరులతో మాట్లాడుతూ.. తన సోదరి గీతిక కొంతకాలం ఎండిఎల్ఆర్ను వీడి దుబాయ్లో మరో విమానయాన సంస్థలో చేరిందని, ఆమె వ్యక్తిత్వంపై ఆరోపణలు చేస్తూ గోపాల్ దుబాయి సంస్థకు లేఖ రాయడంతో ఆమెను ఉద్యోగం నుండి తొలగించారని తెలిపారు.
అప్పటి నుంచి గోపాల్ గీతికను తన సంస్థలో తప్ప మరెక్కడా పని చేయడానికి వీల్లేదని చెప్పే వారని అన్నారు. తన కంపెనీలోనే ఉద్యోగం చేయమని ఆయన చెప్పే వారన్నారు. ఢిల్లీ పోలీసులు కందాపై పోలీసు కేసు నమోదు చేశారు. ఆరోపణలు ఎదుర్కొన్న గోపాల్ రాత్రి ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ను కలిసి తన రాజీనామాను సమర్పించారు. తన సచ్చీలత నిరూపించుకున్నాకే మంత్రివర్గంలో చేరతానని ప్రకటించారు.
ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ఈ కేసులో నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా ఈ కేసును జాతీయ మహిళా కమిషన్ విచారించనుంది. ఈ కేసును తాము మహిళా కమిషన్కు పంపిస్తామని సంబంధింత కేంద్రమంత్రి కృష్ణ తీర్థ్ చెప్పారు.