బెయిల్ స్కాం: గాలి జనార్ధన్ రెడ్డి సోదరుడి అరెస్ట్
ఆయన కొంతకాలంగా తప్పించుకుని తిరుగుతున్నట్లుగా వార్తలు రావడంతో శుక్రవారం ఎసిబి కార్యాలయానికి వివరణ ఇచ్చేందుకు వచ్చారు. ఆ రోజు నుండి ఎసిబి అధికారులు అతనిని బెయిల్ డీల్ కేసుపై విచారిస్తున్నారు. అయితే అతను మాత్రం ఈ కేసులో తన సోదరుడి బెయిల్ కోసం ఎవరికీ డబ్బులు ఇవ్వలేదని ఎసిబి అధికారుల ముందు చెప్పారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తమ ఎదుట హాజరు కావాలని సోమశేఖర రెడ్డికి ఎసిబి అధికారులు గతంలోనే నోటీసులు జారీ చేశారు.
కాగా గాలి బెయిల్ డీల్ కేసులో ఇప్పటికే న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులలతో సహా పలువురిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో దాదాపు ఇప్పటికే ఎసిబి అధికారులు అందరినీ అరెస్టు చేశారు. ఆఖరుకు మిగిలింది సోమశేఖర రెడ్డి ఒక్కరే. ఇప్పుడు ఆయన అరెస్టు కూడా జరగటంతో అందరి అరెస్టు జరిగినట్లుగా భావించవచ్చు.
మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అరెస్టైన బ్రహ్మానంద రెడ్డి బెయిల్ పిటిషన్ పైన విచారణను కోర్టు ఈ నెల 14వ తేదికి వాయిదా వేసింది.